నాడు మోసగించి, నేడు లెక్చర్లా? 

1 Dec, 2022 04:09 IST|Sakshi
ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

దుష్టచతుష్టయం.. గజ దొంగల ముఠా మాటలు నమ్మొద్దు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ప్రతిపక్షాలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నా 

మానవతావాదంతో కూడిన జ్ఞానం రావాలని ఆకాంక్షిస్తున్నా  

ఉన్నత చదువులకు పేదరికం అవరోధం కాకూడదు 

పోటీ ప్రపంచంలో గెలవాలనే విద్యా వ్యవస్థలో సంస్కరణలు 

విప్లవాత్మక కార్యక్రమాలతో ఉన్నత విద్యలో సమూల మార్పులు 

ఒక్క విద్యా రంగంలోనే ఏకంగా రూ.55 వేల కోట్లు వెచ్చించాం 

దుష్టచతుష్టయం.. గజ దొంగల ముఠా మాటలు నమ్మొద్దు 

మీకు మంచి జరిగిందా లేదా అన్నదే ప్రామాణికంగా తీసుకోండి 

ఫలానా ప్రాంతంలో.. ఫలానా పొలాలను.. ఫలానా రేటుకు అమ్ముకునేందుకు మాత్రమే ఒక రాజధాని కట్టాలన్నది వారి ఆలోచన. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వారు వాదిస్తున్నారు. ఇలాంటి వారి మెదళ్లను మార్చగల చదువులు ఎంతైనా అవసరం. వారికి మంచి జ్ఞానం, మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరాల్సిన పరిస్థితి నెలకొంది.  

పిల్లల చదువుల కొరకు ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చైనా సరే.. దానిని నేను ఖర్చుగా భావించను. అది నేను నా పిల్లలకిచ్చే ఆస్తిగా భావిస్తాను. ‘మీరు గొప్పగా చదవండి.. మీ చదువులకి పూచీ నాది..’ అని ప్రతి చిట్టి చెల్లెమ్మకు, తమ్ముడికీ చెబుతున్నా. ‘మీ ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా పరవాలేదు.. అంతమందినీ చదివించండి.. మీ అన్న, తమ్ముడు చదివిస్తాడు’ అని ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెబుతున్నా. నేరుగా మీ ఖాతాల్లో పడుతున్న డబ్బును వారం పది రోజుల్లో కాలేజీలకు వెళ్లి చెల్లించండి. పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా విచారించండని విజ్ఞప్తి చేస్తున్నా.  

మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ.. మనందరి ప్రభుత్వం.. అధికారం చేపట్టి ఈ రోజుకు సరిగ్గా మూడున్నరేళ్లు. ఈ సందర్భంగా మీలో ఒకడిగా, మీ వాడిగా నాతో సమయం పంచుకునేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కాచెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, సోదరుడికి, స్నేహితుడికీ, ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు.   
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

మదనపల్లె నుంచి సాక్షి ప్రతినిధి: ‘రైతులను మోసం చేసిన చంద్రబాబునాయుడు వ్యవసాయం గురించి మాట్లాడుతుండటం విడ్డూరం. పిల్లలకు అన్యాయం చేసి, ఎడ్యుకేషన్‌ గురించి.. అక్కచెల్లెమ్మలకు ద్రోహం చేసి, మహిళా సాధికారత గురించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలను అవమానించి, అన్యాయం చేసి.. సామాజిక న్యాయం గురించి ఈరోజు లెక్చర్లు దంచుతుంటే.. రాష్ట్ర ప్రజలంతా ఇదేమి ఖర్మరా బాబూ!’ అని అనుకుంటున్నారని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

ఇలాంటి కుళ్లిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఉన్న చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ఆయన జగనన్న విద్యా దీవెన పథకం (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌) కింద 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ నాలుగో ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం నిధులు రూ.694 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్థం కాదని.. ప్రతి ఒక్కరూ తమకు తాముగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని ఇవ్వగలగడమే విద్యకు పరమార్థం అని ప్రపంచ ప్రఖ్యాత ఫిజిసిస్ట్‌ ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ చక్కగా చెప్పారన్నారు. ఈ రోజు అటువంటి ఆలోచనా శక్తి కొరవడిన ప్రతిపక్షాలకు ఎప్పటికైనా అది రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు.

పేదల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవడానికి వీల్లేదని వాదించే వారి సంస్కారాలు మారాలని, నా వారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి.. మనుషులంతా ఒక్కటే అన్న మానవతావాదంతో కూడిన జ్ఞానం వారందరికీ రావాలని కూడా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

పిల్లలకు మనమివ్వగలిగే ఆస్తి చదువులే 
► పిల్లలకు మనమివ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువులే. ఏ ఒక్క పాప, బాబు.. చదువులకు పేదరికం అవరోధం కాకూడదని మంచి మనస్సుతో అప్పట్లో ఆ ప్రియతమ నేత, దివంగత నాయకుడు రాజశేఖరరెడ్డి దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ గొప్ప పథకాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ నీరుగార్చుతూ వచ్చాయి.   

► చదువుల కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నారో నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. వారి కష్టాలు విన్నాను. నేను ఉన్నాను అని చెప్పాను. అందుకే అధికారంలోకి రాగానే ఆ పరిస్థితులను మారుస్తూ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం.    

► జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మీ ప్రభుత్వం భుజ స్కంధాలపై మోస్తోంది. హాస్టల్‌ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేల వరకు సాయం చేసేలా జగనన్న వసతి దీవెన పథకాన్ని అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలోని 2017–18, 2018–19కు సంబంధించి రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెడితే మనందరి ప్రభుత్వం చిరునవ్వుతో వాటిని చెల్లించింది.   

► ఈ మూడున్నరేళ్లలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.3,349 కోట్లు.. మొత్తంగా ఈ రెండు పథకాల ద్వారా రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టాం.  

విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు 
► ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకొచ్చాం. మీ పిల్లలను బడులకు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ‘జగనన్న అమ్మఒడి’ ద్వారా మీకు తోడుగా ఉన్నాం. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, మన బడి నాడు–నేడు, బైలింగ్వల్‌ టెక్ట్స్‌బుక్స్, బైజూస్‌తో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్‌ క్లాస్‌ రూములు.. ఇలా ఎన్నో పథకాలు, కార్యక్రమాల ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. 

► ఉన్నత విద్యలో కరిక్యులమ్‌ అంతా కూడా జాబ్‌ ఓరియంటెడ్‌గా మార్పులు చేస్తూ వచ్చాం. డిగ్రీలు చదివేటప్పుడే ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేశాం. ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ విత్‌ క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ తీసుకొచ్చాం. ఆ¯ŒŒ లైన్‌లో కూడా మంచి కోర్సులు ఎక్కడున్నాయా అని వెదికి పట్టుకుంటున్నాం. వాటిని కూడా మన పిల్లలకు నేర్పిస్తూ.. వాటికి కూడా క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ కింద అనుమతులు ఇస్తున్నాం. 

► ప్రఖ్యాత సంస్థలన్నింటితో మాట్లాడి సర్టిఫైడ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను మన పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యా రంగాన్ని ఉపాధికి చేరువగా తీసుకుపోతున్నాం. 

మూడున్నరేళ్లలో రూ.55 వేల కోట్లు   
► జగనన్న అమ్మఒడి ద్వారా రూ.19,617 కోట్లు, జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.9,051 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా మూడున్నరేళ్లలో రూ.3,349 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా మరో రూ.2,368 కోట్లు ఖర్చు చేశాం. ఎనిమిదో తరగతి పిల్లలు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇచ్చేందుకు మరో రూ.685 కోట్లు ఈ డిసెంబర్‌లో ఖర్చు చేయబోతున్నాం.  

► జగనన్న గోరుముద్ద ద్వారా రూ.3,239 కోట్లు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మొదటి ఫేజ్‌లో రూ.3,669 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశాం. ఈ ఏడాది నాడు–నేడు ఫేజ్‌ 2 కింద మరో రూ.8 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. వైఎస్సార్‌ సంపూర్ణపోషణ కోసం రూ.4,895 కోట్లు, శానిటరీ నేప్‌కిన్స్ అందించే ‘స్వేచ్ఛ’ అనే కార్యక్రమం కోసం రూ.32 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా ఈ మూడున్నరేళ్లలోనే విద్య కోసం మీ జగనన్న ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.55 వేల కోట్లు.  

► మనందరి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఏటా మూడు లక్షల మంది పిల్లలు డిగ్రీ పట్టాలు అందుకుంటే.. వారిలో 37 వేల మందికే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలొచ్చేవి.  2021–22లో క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా 
85 వేల మంది పిల్లలకు ఉద్యోగాలొచ్చాయి. 

మదనపల్లెకు వరాల జల్లు 
నా సోదరుడు, ఎమ్మెల్యే నవాజ్‌ మదనపల్లి అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాలు అడిగారు. మెడికల్‌ కాలేజీ ఇప్పటికే మంజూరు చేశాం. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ నెలలోనే పనులు మొదలవ్వనున్నాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 2 వేల అడుగుల లోతుకు బోరు వేస్తే తప్ప తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలన్న తపనతో వాటర్‌ గ్రిడ్‌ కోసం రూ.1,800 కోట్లు మంజూరు చేశాం. ఇందులో మదనపల్లెకే రూ.400 కోట్లు వస్తుంది.

మున్సిపాల్టీ అభివృద్ధి కోసం రూ.38 కోట్లు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మొలకలచెరువు నుంచి మదనపల్లె ఎన్‌హెచ్‌ రోడ్డుకు రూ.400 కోట్లతో, మదనపల్లె– తిరుపతి ఎన్‌హెచ్‌ రోడ్డుకు మరో రూ.1,600 కోట్లతో మంజూరు ఇప్పించాం. మీ అందరి కోరిక మేరకు మదనపల్లె బీటీ కాలేజీని ప్రభుత్వంలో విలీనం చేశాం. మదనపల్లె టిప్పుసుల్తాన్‌ మసీదు కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నాం.

మదనపల్లె నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం రూ.30 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చారు. వాటిని కూడా ఆమోదిస్తున్నాను. మదనపల్లె టౌన్‌ పరిధిలో 3 బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడం కోసం మరో రూ.14 కోట్లు అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. బహుదా నదిపై బ్రిడ్జి కోసం అవసరమైన మరో రూ.7 కోట్లు కూడా ఇస్తున్నాం. వీటిన్నింటి ద్వారా మదనపల్లెకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.   

పెత్తందార్ల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు 
► నవరత్నాల పాలనతో పేదలకు మనందరి ప్రభుత్వం మంచి చేస్తుంటే.. దానిని జీర్ణించుకోలేక, పేదలు బాగుపడటం తట్టుకోలేక, తమకు పుట్టగతులుండవనే భయంతో ఈ పెత్తందార్లు అంతా కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్‌ బటన్‌ నొక్కడం వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట! ఇదే రాష్ట్రం వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా అట!   

► ఈ గజదొంగల ముఠాకు దుష్టచతుష్టయం అని పేరు. అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు. వీరికి తోడు దత్తపుత్రుడు. ఈ గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అనే పద్ధతిలో పాలించింది. అందుకే ఆ రోజు బటన్లు లేవు. నొక్కే వారూ లేరు. ప్రజలకు నేరుగా మంచి జరగాలనే ఆలోచనలే లేవు. 

► ఈ ముఠా చేస్తున్న దౌర్భాగ్యపు రాజకీయాలను ఎవరూ రాయరు. ఎవరూ చూపరు. ప్రశ్నించే వారు కూడా లేరు. అటువంటి వారితో ఈరోజు మనం యుద్ధం చేస్తున్నాం. ఇవాళ మీ బిడ్డ ఇటువంటి పత్రికలను, టీవీ చానళ్లను నమ్ముకోలేదు. దత్తపుత్రుడినీ అంతకన్నా నమ్ముకోలేదు.  

► మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండండి. ఇవాళ మనం రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఈ రోజు చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా రాష్ట్రానికి ఇదే బడ్జెట్‌ ఉండేది. మరి అప్పుడు పాలకులు ఎందుకు జగన్‌ మాదిరిగా నేరుగా బటన్‌ నొక్కి.. మా బ్యాంకు ఖాతాల్లోకి ఎందుకు డబ్బులు వచ్చేటట్లు చేయలేకపోయారని ఆలోచించండి. గత ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించండి. 

► మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. మీతోనే నా పొత్తు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి  98 శాతం హామీలను అమలు చేశాం. మీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మీ ఇంటి గడపవద్దకు వచ్చి మీకు జరిగిన మేలు గురించి అడుగుతున్నారు. మీ బిడ్డ ప్రభుత్వాన్ని దీవించమని మీ ఆశీస్సులు తీసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు