చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా అది: సీఎం జగన్‌

6 Jun, 2023 14:28 IST|Sakshi

సాక్షి, ఏలూరు: ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయని.. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారని, ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారని, ఈ ఖాళీల గుండా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.

చిన్న సమస్యను పెద్ద విపత్తులాగా చూపిస్తున్నారు
ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్‌ దారుణంగా దెబ్బతిందని.. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదని, ఎందుకంటే.. రామోజీరావు బంధువులకే నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించారని ప్రస్తావించారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేని గైడ్‌వాల్‌  వంటి చిన్న సమస్యను పెద్ద విపత్తులాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  అయినా దీన్నికూడా పాజిటివ్‌గా తీసుకుని తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

పనుల పరిశీలన
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమగ్రంగా పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. గత సీజన్‌లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు పెంచిన ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు, ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దిగువ కాఫర్‌ డ్యాం పనులను కూడా సీఎం దగ్గరుండి పరిశీలించారు.
చదవండి: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం జగన్‌

అధికారులతో సమీక్ష
అదే విధంగా గత ప్రభుత్వంలో ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇసుకను నింపే పనులను,  వైబ్రో కాంపాక్షన్‌ పనులను పరిశీలించిన సీఎం.. డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో పునర్‌ నిర్మాణాలు, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణలపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జతన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు 

పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని అధికారులు వెల్లడించారు. రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మెమోరాండం జారీచేసిందని, దీన్ని కేంద్ర జలశాఖకు లేఖద్వారా తెలిపిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో నిర్మాణాల కోసం అదనంగా రూ.9 వేల కోట్లు ఇందులో భాగంగా ఇచ్చిందని తెలిపారు.  కాంపౌండ్‌వారీ బిల్లుల చెల్లింపు వల్ల ప్రాజెక్టు నిర్మాణాలు ఆలస్యం అవుతున్న విషయాన్నిపరిగణలోకి తీసుకుని దానికి కేంద్ర మినహాయింపులు కూడా ఇచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరాయంగా సంప్రదింపులు, చర్చలు జరిపి, ప్రత్యేక దృష్టిపెట్టడంతోనే ఇది సాధ్యమైందని అధికారులు తెలియజేశారు. 

గైడ్‌వాల్‌లో చిన్న సమస్యను విపత్తు మాదిరిగా చూపిస్తున్నారు:
►గైడ్‌వాల్‌పై సమీక్షా సమావేవంలో ప్రస్తావన.
►గైడ్‌వాల్‌ డిజైన్లన్నీ కేంద్ర జలసంఘం - సీడబ్ల్యూసీ ఖరారుచేసిందని, వారి ఆమోదంతోనే పనులు చేశామని అధికారులు వెల్లడించారు.
►ప్రస్తుతం వచ్చిన సమస్యను కూడా వారికి నివేదించామని తెలిపారు.
► దీన్ని సరిదిద్దడం పెద్ద సమస్యకాదని, సీడబ్ల్యూసీ పరిశీలన కాగానే వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పారు.

కీలక పనుల్లో గణనీయ ప్రగతి:
పోలవరం ప్రాజెక్టులో కీలక పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంజగన్‌కు వివరించారు.
► స్పిల్‌వే కాంక్రీట్ పూర్తయ్యింది.
►48 రేడియల్‌ గేట్లు పూర్తిస్థాయిలో పెట్టారు.
► రివర్‌ స్లూయిస్‌ గేట్లు పూర్తయ్యాయి.
► ఎగువ కాఫర్‌ డ్యాంకూడా పూర్తయ్యింది.
►  దిగువ కాఫర్ డ్యాం పూర్తయ్యింది.
► గ్యాప్‌ -3 వద్ కాంక్రీట్‌ డ్యాం పూర్తయ్యింది.
► పవర్‌హౌస్‌లో సొరంగాల తవ్వకం పూర్తయ్యింది.
► అప్రోచ్‌ ఛానల్‌ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి.
►ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో దెబ్బతిన్న గ్యాప్‌-1 ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం పూర్తయ్యింది. ఆప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్‌కూడా పూర్తయ్యింది.
►ఈసీఆర్‌ఫ్‌ గ్యాప్‌-2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100శాతం ఇసుక రవాణా పూర్తయ్యింది.
►ఇక వాటిని నింపే పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి. 
► నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు తెలిపారు.

డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి: సీఎం
► దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
► ఇది పూర్తైతే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు.
► డిసెంబర్‌ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని అధికారులు తెలిపారు.

నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష
►పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
►కాలనీలు ఓవైపు పూర్తవుతున్న కొద్దీ, సమాంతరంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి. 
► నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు చెప్పారు.
► షెడ్యూలు ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలని సీఎం ఆదేశించారు.

పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలి
► పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిజ్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలి.
►పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలి. 
► పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్‌ ఏర్పాటుకూడా చర్యలు తీసుకోవాలి.
►మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.

మరిన్ని వార్తలు