‘శత్రువు కనిపించకపోవచ్చు.. మీ వైఫల్యాలు కనిపిస్తున్నాయి’

14 May, 2021 21:13 IST|Sakshi

కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను టార్గెట్‌ చేసుకొని కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శలు గుప్పించింది.  శత్రువు కనిపించకపోవచ్చు కానీ కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తింది. ఈమేరకు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, జైరామ్‌ రమేశ్‌, చిదంబరం ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై చురకలంటించారు. 

‘శత్రువు కనిపించకపోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కానీ మీ పాలన వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి" అని మాజీ పర్యావరణశాఖ మంత్రి జైరామ్ రమేష్ విమర్శించారు. మరోవైపు ‘మిస్టర్ ప్రధాని, ప్రజల జీవితాలను కాపాడటానికి ఈ దేశంలోని యోధులు పనిచేస్తున్నారు కానీ మీరు వారికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? మీరు అదృశ్యమయ్యారు’ అని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్‌ చేసింది. 

ఈ రోజు ఉదయం గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 100 ఏళ్ల తర్వాత ఇంత భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని అడుగడుగునా పరీక్షిస్తోందని చెప్పారు. మన ముందు అదృశ్య శత్రువు ఉందని.. అది వివిధ రూపాల్లో ఉందని చెప్పారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ వ్యతిరేక పోరాటంలో వనరులలోని అడ్డంకులను అధిగమిస్తున్నట్టు తెలిపారు. యుద్దప్రతిపాదికన కరోనాపై పోరు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

చదవండి: రైతుల ఖాతాల్లోకి పీఏం కిసాన్ నగదు.. చెక్‌ చేసుకోండి ఇలా?

మరిన్ని వార్తలు