జగ్గారెడ్డి తీరుపై గాంధీభవన్‌లో వాడివేడి చర్చ

25 Sep, 2021 13:45 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం గాంధీ భవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీరుపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్ సమక్షంలో జగ్గారెడ్డి, మల్లు రవి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్న పరిస్థితి తలెత్తింది. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో చోటు చేసుకున్న పరిణామంపై చర్చించారు. 

పార్టీ అంతర్గత విషయాలను, రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడడం వంటి అంశాలను మల్లు రవి తప్పు పట్టారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఏఐసీసీ కార్యకర్తలు ఇద్దరిని సముదాయించి సమీక్ష సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. సాయంత్రం జరిగే పీఏసీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మానిక్కం ఠాగూర్ పాల్గొననున్నారు.
(చదవండి: నివురుగప్పిన నిప్పు: రేవంత్‌ వర్సెస్‌ సీనియర్లు)

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. జగ్గారెడ్డి విమర్శలపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆరా తీశారు. ఆయన మాట్లాడిన వీడియో క్లిపులను తెప్పించుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో పీసీసీ చీఫ్ టూర్‌కు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు జిల్లాలో కార్యక్రమం గురించి ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. వన్ మ్యాన్ షో లా చేస్తే కుదరదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: దో షేర్‌.. దో బకరే 

మరిన్ని వార్తలు