న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ నడుస్తోందని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి చెప్పిందే వేదమని, నియంతృత్వ పాలన సాగుతోందని ఫైర్ అయ్యారు. మోదీ పాలనలో దేశ న్యాయవ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. జ్యుడీషియరీని కూడా ప్రధాని కార్యాలయంలో ఓ భాగం చేశారని మండిపడ్డారు.
దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని విభజిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు తెలియజేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని జైరాం రమేశ్ మీడియా సమావేశంలో తెలిపారు.
'దేశంలో అనధికారిక ఎమెర్జెన్సీ ఉంది. ఒక వ్యక్తే శాసిస్తున్నారు. పార్లమెంటుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సభలో చర్చలు జరగనివ్వడం లేదు. రెండున్నరేళ్లుగా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడమే ఇందుకు ఉదాహరణ. రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను బలహీనం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత