సేవలు చేయించుకుని రోడ్డుపై పడేస్తారా?

31 Jul, 2021 08:55 IST|Sakshi

గాంధీభవన్‌లో స్టాఫ్‌ నర్సుల దీక్ష విరమింపజేసిన గీతారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కష్టకాలంలో ఏడాది పాటు సేవలు చేయించుకుని ఇప్పుడు 1,640 మంది ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సులను నడిరోడ్డుపై పడేశారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి జె. గీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు దేవుళ్లతో సమానం అన్న కేసీఆర్‌కు నర్సులు దేవతల్లా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే స్టాఫ్‌నర్సులను పునఃనియమించాలని, లేదంటే వారి పక్షాన కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. తమను విధుల్లోకి తీసుకోవాలని స్టాఫ్‌నర్సులు శుక్రవారం గాంధీభవన్‌లో చేపట్టిన దీక్షను గీతారెడ్డి విరమింపజేశారు. 

ఈ సందర్భంగా గీతా రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి, మానవత్వం ఉంటే ఈ ఆడబిడ్డలకు న్యాయం చేయాలని కోరారు. స్టాఫ్‌నర్సులను ప్రభుత్వం 10 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని, అధికార పార్టీ నేతలను అడ్డుకుంటామని యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి హెచ్చరించారు. కాగా, దీక్ష విరమణ సందర్భంగా గీతారెడ్డితో మాట్లాడుతూ స్టాఫ్‌నర్సులు కంటతడి పెట్టుకున్నారు.
 

మరిన్ని వార్తలు