Jagga Reddy: కాంగ్రెస్‌లో సింగిల్‌ హీరో కుదరదు..

24 Sep, 2021 10:24 IST|Sakshi

హైదరాబాద్‌:  కాంగ్రెస్‌లో సింగిల్‌ హీరో కుదరదు.. ఒక్కడి ఇమేజ్‌ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో​ మాట్లాడుతూ.. ఇది పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీనా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  పార్టీలో చర్చించకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్‌ చేయడమేంటని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో అందరూ ఒకటే..  ఒక్కరే స్టార్‌ అనుకుంటే కుదరదని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డికి పీసీసీ వస్తే .. నాకు సమాచారం ఇ‍వ్వరా.. ఈ మాత్రం ప్రోటోకాల్‌ కూడా తెల్వదా అని ఎద్దేవా చేశారు.  జగ్గారెడ్డికి , రేవంత్‌ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు రేవంత్‌ పరోక్షంగా చెబుతున్నారా.. అని విమర్షించారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ కాకముందు.. తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాగా, సీఎల్పీ కార్యాలయంలో మరికొద్ది సేపట్లో కాంగ్రెస్‌ సభాపక్షం  సమావేశంకానున్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఇప్పటికే సీఎప్పీ కార్యాలయానికి చేరుకున్నారు. 

మీడియా పాయింట్‌ వద్ద..

రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు.. పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్‌ మీడియా ద్వారా నాపై అసత్యప్రచారాలు చేస్తారా.. అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా పాయింట్‌ దగ్గర మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేను.. తనకు మాట్లాడటానికి అవకాశం ఎందుకు ఇ‍వ్వలేదని గీతారెడ్డిని ప్రశ్నించారు.

ఎవరి ఒత్తిడి మేరకు ఇలా ప్రవర్తించారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఏం జరుగుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారాలంటే నాకు అడ్డు చెప్పేవారు ఎవరని అన్నారు. కాగా, ఎథిక్స్‌కి కట్టుబడి..  తాను కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంలో పనిచేస్తున్నట్లు తెలిపారు.  పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు సరైన గౌరవంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే గ్రామస్థాయిలో వెళ్లి పనిచేయాలని అన్నారు.  ఈ రాష్ట్రంలో నాకు అభిమానులున్నారు. కావాలంటే పార్టీ సపోర్ట్‌ లేకుండా 2 లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానని జగ్గారెడ్డి సవాల్‌ విసిరారు. తప్పని పరిస్థితిలో మీడియా ముందు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. ​ 

చదవండి: రెండోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

మరిన్ని వార్తలు