కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్‌లో పడొద్దు: మధు యాష్కీ

5 Mar, 2022 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కేసీఆర్ ఫ్రంట్‌కు మోదీ నిర్మాత, డైరెక్టర్ ప్రశాంత్ కిషోర్, ప్రధాన నటుడు కేసీఆర్’ అంటూ టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాష్కీ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ ఎన్నికల తరువాత కేసీఆర్ ఎందుకు సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘‘మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం కాదు.. కుటుంబ దోపిడీకి వ్యతిరేకమని’’ ఆయన అన్నారు.

చదవండి: కేసీఆర్‌కు పీకే..  మాకు 40 లక్షల మంది ‘ఏకే 47లు’ : రేవంత్‌

‘‘కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో మనం పడకూడదు. నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు. మనం బీహార్ అధికారులపై విమర్శలు చేస్తున్నప్పుడు .. తెలంగాణ ఐఏఎస్‌లు మనతో కలిసి వస్తారా.. తెలంగాణ ఐఏఎస్ అధికారులకు లేని ఇబ్బంది మనకెందుకు. తెలంగాణలో పనిచేసే అధికారం దేశంలోని అన్ని ప్రాంతాల ఐఏఎస్‌లకు ఉంది. తెలంగాణ ప్రత్యేక దేశం కాదు.. ప్రత్యేక రాష్ట్రం మాత్రమేనని’’ మధుయాష్కీ అన్నారు.

‘‘మన ఊరు-మన పోరు కార్యక్రమాల్లో బహిరంగ సభలు పెట్టడం వల్ల లాభం లేదు. గ్రామస్థాయిలో రచ్చ బండపై కూర్చొని మాట్లాడితే లాభం ఉంటుంది. గ్రామాల పర్యటనల తరువాత సభలు పెట్టాలి. చెడ్డి వేసుకున్నాక ప్యాంటు వేసుకోవాలి .. ప్యాటు వేసుకున్నాక చెడ్డి వేసుకోవడం సరికాదు. భట్టి విక్రమార్క చేస్తున్నట్లుగా గ్రామ గ్రామంలో తిరగాలి. త్వరలో ప్రచార కమిటీ ద్వారా కూడా గ్రామాల వారిగా సమావేశాలు పెడతాం. ప్రచార కమిటీ ద్వారా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రణాళిక రూపొందిస్తాం. దీనిపై రాహుల్ గాంధీకి నివేదిక ఇచ్చాను. త్వరలోనే ప్రచార కమిటీ లు ఏర్పాటు చేస్తామని’’ మధు యాష్కీ వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు