యూపీలో కాంగ్రెస్​కు భారీ ఎదురు దెబ్బ.. బీజేపీలో చేరిన రాహుల్​ సన్నిహితుడు

25 Jan, 2022 15:26 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కోలది ఆయా పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా, యూపీకి చెందిన కాంగ్రెస్​ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి ఆర్​పీఎన్​ సింగ్​ కాంగ్రెస్​కు గుడ్‌ బై చెప్పేశారు. అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఈ సంఘటన  యూపీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది.

ఆర్​పీఎన్​ సింగ్​ యూపీలో కాంగ్రెస్​కు చెందిన ప్రముఖ నాయకుడు.. పడ్రానా నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపోందారు. కాగా, యూపీలో కాంగ్రెస్​ పార్టీ.. తాజాగా  ప్రకటించిన స్టార్​ క్యాంపెయినర్​ లిస్టులో ఈయన కూడా ఒకరు. రాహుల్​ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. కాగా, ఆయన మంగళవారం సోనియా గాంధీకి రాసిన రాజీనామాను ట్విటర్​లో పోస్ట్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్​లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. నా రాజకీయ జీవితంలో  ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆర్​పీఎన్​ సింగ్​ మంగళవారం బీజేపీ డిప్యూటి సీఎం కేశవ ప్రసాద్​ మౌర్య, దినేష్​ శర్మ.. అదే విధంగా యూపీ బీజేపీ ఇన్​చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్​ ఆధ్వర్యంలో ఢిల్లీలో కాషాయ జెండా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యూపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్​ సింగ్​, కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్​ బలూని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్​పీఎన్​ సింగ్​ మాట్లాడుతూ.. 32 సంవత్సరాలు తాను కాంగ్రెస్​ పార్టీకోసం పనిచేశానన్నారు. కానీ కాంగ్రెస్ గతంలో మాదిరిగా ప్రస్తుతం లేదన్నారు. అయితే, తాను.. బీజేపీని అధికారంలోకి తేవడానికి ఒక సాధారణ కార్యకర్త మాదిరిగా పనిచేస్తానని తెలిపారు. బీజేపీ అధినాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించిన సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. 

కాగా, ఆర్​పీఎన్​ సింగ్​ పద్రౌనా నియోజక వర్గం నుంచి మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఖుషీనగర్​ నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఆయనకు స్థానికంగా మంచి నాయకుడిగా పేరు ఉంది. అయితే, ఆర్​పీఎన్​ సింగ్​ పద్రౌనా నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటికి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల బీజేపీని వీడిన మంత్రి స్వామి ప్రసాద్​ మౌర్య స్థానాన్ని.. ఆర్​పీఎన్​ సింగ్​ భర్తీ చేస్తారని పలువురు భావిస్తున్నారు. ప్రసాద్​ మౌర్యకు గట్టిపోటిని కూడా ఇస్తారని స్థానిక నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పద్రౌనా నుంచి ప్రసాద్​ మౌర్య కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఈ స్థానం నుంచి ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ఆర్​పీఎన్​ సింగ్​ తన అనుచరులకు పోటీ చేసేందుకు కాంగ్రెస్  టికెట్​ నిరాకరించడంతో కలత చెందినట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్​ను వీడినట్లు పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్​లో యూపీలో  రెండేళ్లలో పలువురు కీలక నేతలను కోల్పోయింది. పార్టీని వీడిన వారంతా..  రాహుల్​కు  సన్నిహితులు కావడం గమనార్హం. గతంలో జితిన్ ప్రసాద్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత యోగి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.

ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కూడా పార్టీ మారిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై కాంగ్రెస్​ పార్టీకి చెందిన 23 మంది నాయకులు సోనియా గాంధీకి లేఖలు సైతం రాశారు. కాగా, ఆర్​పీఎన్​ సింగ్​ రాజీనామాపై జార్ఖండ్​ కాంగ్రెస్ పార్టీ చీఫ్​ రాజేష్​ ఠాకూర్​ స్పందించారు. సింగ్​.. పార్టీని వీడటం బాధగా ఉందని తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయం తప్పుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.  

చదవండి:  సిద్ధూను మంత్రిని చేయమని పాక్‌ కోరింది: అమరీందర్‌ సింగ్‌

మరిన్ని వార్తలు