చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తత: కాంగ్రెస్‌ నాయకుల అరెస్ట్‌

19 Jan, 2021 12:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ డిమాండ్‌పై మంగళవారం హైదరాబాద్‌లో చేపట్టిన చలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ నుంచి ఎన్టీఆర్ మార్గం మీదుగా రాజ్‌భవన్‌ వెళ్లేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌ ముట్టడి చేపట్టారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద అడ్డుకున్నారు.

కార్యక్రమంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు ఈ చట్టంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా సామాన్యుడి నడ్డి విరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలని సవాల్‌ విసిరారు. శాంతియుతంగా రాజ్‌భవన్‌ ముట్టడికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్‌ చేసిన నాయకులను పోలీసులు ఆయా పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. జిల్లాల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.

మరిన్ని వార్తలు