‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

7 Sep, 2022 14:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని వెల్లడించారు. తన స్థానంలో ఈ సారి సంగారెడ్డి కార్యక్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. క్యాడర్‌ వద్దంటే.. తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. మళ్లీ 2028 ఎన్నికట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. 

ఇదిలా ఉండగా ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్‌ పార్టీ ఫైర్‌ బ్రాండ్ జగ్గారెడ్డి ఈ మధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు. సొంత పార్టీ లో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఆయన నోరెత్తడం లేదు. నెలరోజులకుపైగా గాంధీభవన్‌కు కూడా రావడం లేదు. దీంతో ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

బీజేపీ, టీఆర్‌ఎస్‌లలో పనిచేసి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చిన జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం నెరుపుతుంటారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వేదికగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తన ఆహార్యంతోనే విలక్షణంగా కనిపించే జగ్గారెడ్డి ఏది చేసినా చర్చకు దారితీస్తుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన ఆయన పార్టీకి నష్టం కలిగిస్తున్నారనేంతవరకు వెళ్లారు. అయినా వెనక్కు తగ్గని జగ్గారెడ్డి తాను పార్టీ మంచి కోసమే చెబుతున్నానంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్లారు. 

మరిన్ని వార్తలు