వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

18 Oct, 2021 01:14 IST|Sakshi

సాక్షి, డిండి(నల్లగొండ): రాష్ట్రంలో భవిష్యత్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలోని శేషాయికుంటలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  ఆయన మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ముం దుకు వెళ్లాలని సూచించారు.

సీఎం కేసీఆర్‌ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే అని, పెట్రోల్, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల జీవితాలను దుర్భరంగా మార్చారన్నారుఏడున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు.

నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 12 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌పార్టీ కైవసం చేసుకోనుందని ఆ దిశగా పార్టీని నడిపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, అఖిల భారత ఆదివాసి జాతీయ కోఆర్డినేటర్‌ కిషన్‌ నాయక్, డిండి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు