10 రోజుల్లో తేల్చేద్దాం! మునుగోడు అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు 

21 Aug, 2022 02:50 IST|Sakshi

పరిశీలనలో నాలుగైదు పేర్లు.. బీసీ అభ్యర్థిత్వంపైనా ఆలోచన 

పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతి పేరుపై అధిష్టానం ఆరా 

పల్లె రవి, చెరుకు సుధాకర్, కైలాశ్‌ నేత తదితరుల్లో ఎవరైతే బాగుంటుందన్న దానిపై సర్వే 

సర్వేల ఆధారంగా ప్రతిపాదనలు పంపనున్న టీపీసీసీ 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సుకూ ప్రాధాన్యత.. 

వచ్చే నెల మొదట్లోనే అభ్యర్థి ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయడంపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి సారించింది. టీఆర్‌ఎస్, బీజేపీల నుంచి అభ్యర్థులు ఎవరనేది దాదాపు ఖరారైన నేపథ్యంలో గందరగోళానికి తావు లేకుండా.. వీలైనంత త్వరగా తమ అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తోంది. మరో 10 రోజుల్లో అంటే సెప్టెంబర్‌ మొదట్లోనే కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని యోచిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా చేపట్టింది. వీటి నివేదికల ఆధారంగా అధిష్టానానికి టీపీసీసీ ప్రతిపాదనలు పంపనుంది. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారు విషయంలో ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సుకూ ప్రాధాన్యత ఉంటుందని, ఆయనతోపాటు జిల్లాలోని కీలక నేతలందరి అభిప్రాయం తీసుకున్నాకే అభ్యర్థి ఎవరనేది నిర్ణయించనున్నారని గాంధీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి. 

రేసులో ఐదుగురు
మునుగోడులో పోటీకోసం కాంగ్రెస్‌ పార్టీలో ఐదుగురు నేత లు టికెట్‌ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, చండూరు ఎంపీపీ పల్లె కల్యాణి భర్త పల్లె రవికుమార్‌గౌడ్, ఇటీవల కాంగ్రెస్‌లో చేరి న తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్, టీపీసీసీఅధి కార ప్రతినిధి పున్నా కైలాశ్‌ నేత, వ్యాపారవేత్త చల్లమల్ల కృష్ణారెడ్డి తదితరులు రేసులో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తు న్నా యి. ఇందులో స్రవంతి అభ్యర్థిత్వంపై అధిష్టానం పెద్దలు ఇప్పటికే ఆరా తీశారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగు తోంది. గోవర్ధన్‌రెడ్డి కుమార్తెగా ఆమెకు నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

బీసీ నేతకు చాన్స్‌పై చర్చ 
కాంగ్రెస్‌ తరఫున బీసీ అభ్యర్థిని బరిలో దింపితే ఎలా ఉంటుందని టీపీసీసీ నేతలు, అధిష్టానం పెద్దల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బీసీలు ఉండడం, అక్కడ బీసీ వాదానికి కొంత సానుకూల పరిస్థితి ఉందని సర్వేలో తేలడం, ఇతర ప్రధాన పార్టీల నుంచి అగ్రవర్ణాల అభ్యర్థులు బరిలో ఉండనుండటం నేపథ్యంలో బీసీ నేతలపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది.

ఈ క్రమంలో పల్లె రవి, చెరుకు సుధాకర్, కైలాశ్‌ నేతలలో ఎవరైతే బాగుంటుందన్న దానిపై టీపీసీసీ సర్వే చేయించినట్టు సమాచారం. మొత్తంగా సర్వే నివేదికల ఆధారంగా జాబితాను అధిష్టానానికి పంపనున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ అంతా 10 రోజుల్లో పూర్తవుతుందని, సెప్టెంబర్‌ నెల మొదట్లోనే తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు