కాంగ్రెస్‌ మెగా ర్యాలీ వాయిదా

19 Aug, 2022 05:34 IST|Sakshi

సెప్టెంబర్‌ నాలుగున నిర్వహణ  

న్యూఢిల్లీ:  దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యకు నిరసనగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 28వ తేదీన తలపెట్టిన తలపెట్టిన మెగా ర్యాలీ వాయిదా పడింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సెప్టెంబర్‌ 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ గురువారం తెలిపారు. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని మెగా ర్యాలీని వాయిదా వేసినట్లు వెల్లడించారు.

వచ్చే నెల 4న నిర్వహించబోయే భారీ ర్యాలీతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బలమైన సందేశం పంపిస్తామని అన్నారు. ప్రజా సమస్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 22న రాష్ట్ర స్థాయిలో, 25న జిల్లా స్థాయిలో, 27న బ్లాక్‌ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే సెప్టెంబర్‌ 7న ప్రారంభమయ్యే భారత్‌ జోడో యాత్రకు సిద్ధమవుతోంది. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్‌ దాకా ఆ యాత్ర సాగనుంది. 

మరిన్ని వార్తలు