ఆ మంత్రుల భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి
గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
దళితుల భూములు, దేవుడి మాన్యాలనూ వదలలేదని తీవ్ర విమర్శ
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ ‘పవర్’పంచ్ విసిరింది. 10 మంది మంత్రులపై ఆరోపణలను ఎక్కుపెట్టింది. దొంగలముఠాలా ఏర్పడి దోచుకుతింటున్నారని ధ్వజమెత్తింది. పేదల భూములపై రాబందుల్లా వాలిపోయి కబ్జా చేశారని తీవ్రంగా విమర్శించింది. మంత్రుల అవినీతి, అక్రమాలపై సీఎం కేసీఆర్ సక్రమంగా విచారణ జరిపిస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు లేదని, అందుకే సిటింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్కుమార్ డిమాండ్ చేశారు.
‘గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు’పేరిట శుక్రవారం ఆయన గాంధీభవన్లో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో భూకబ్జాలు తారస్థాయికి చేరాయని, కొందరు మంత్రులైతే దళితుల భూములు, దేవుడి మాన్యాలను కూడా వదలడంలేదని ఆరోపించారు. భూకబ్జాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జూమ్యాప్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, నాయకులు అనిల్యాదవ్, రోహిత్లు పాల్గొన్నారు. ఆయా మంత్రులపై సంపత్ కుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్లో చేసిన ఆరోపణలు ఈవిధంగా ఉన్నాయి...
రాబందుల్లా పడ్డారు: ఉత్తమ్
కాంగ్రెస్ హయాంలో పేదలకు భూమి పంపిణీ చేస్తే టీఆర్ఎస్ నేతలు వాటిని కబ్జా చేశారని ఉత్తమ్ ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఒకవైపు సీఎం కేసీఆర్ చెబుతుండగా, మరోవైపు తన కేబినెట్ సహచరులు రాబందుల్లా వారి భూములను కబ్జా చేస్తున్నారని అన్నారు. వీరంతా దొంగల ముఠాలాగా ఏర్పడి అక్రమంగా దోచుకుంటున్నారని విమర్శించారు. భూదందాలకు పాల్పడిన మంత్రులను శిక్షించాలని రాష్ట్ర గవర్నర్కు లేఖ రాయనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు.
చదవండి: Etela Rajender: రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు