రేవంత్‌ నిర్ణయానికి చెక్‌ పెట్టిన సీనియర్లు.. టీపీసీసీ చీఫ్‌ తన ఇష్టమంటే కుదరదు!

16 Sep, 2022 11:49 IST|Sakshi

TPCC Chief Revanth Reddy.. తెలంగాణలో కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అడ్డుచెబుతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహంలో సైతం రేవంత్‌కు సీనియర్లు షాకిచ్చారు. దీంతో, రేవంత్‌ చేసేదేమీ లేక వెనక్కి తగ్గారు. 

ఏం జరిగిందే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌కి సీనియర్లు మళ్లీ చెక్‌ పెట్టారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, కొత్తజెండాపై సీనియర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కాగా, ఈ తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో విస్తృతస్థాయి సమావేశాలో ఆమోదం పొందినప్పటికీ కొంత మంది సీనియర్లు వ్యతిరేకించారు. దీంతో, సీనియర్లను గౌరవిస్తూ రేవంత్‌ రెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాగా, కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణపై సస్పెన్స్‌ నెలకొంది.  

కాగా, సెప్టెంబర్‌ 17వ తేదీ సందర్బంగా తెలంగాణలో కాంగ్రెస్‌ స్వాత​ంత్య్ర దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేవంత్‌ రెడ్డి కొత్త తెలంగాణ తల్లి విగ్రహం, పార్టీ జెండాను రూపొందించారు. దీంతో, ఆయన నిర్ణయాన్ని సీనియర్లు వ్యతిరేకించారు. రేవంత్‌.. కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీగా చూస్తున్నారని గుస్సా అయ్యారు. తమకు చెప్పకుండా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్‌ సీనియర్లు విగ్రహం విషయంలో వ్యతిరేకత తెలపడంతో విగ్రహం ఆవిష్కరణ నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో, సెప్టెంబర్‌ 17న గాంధీభవన్‌లో కేవలం జాతీయ జెండాను మాత్రమే ఎగురవేయనున్నట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు