కరోనా కన్నా వారికి భయంకరమైన లక్షణాలు: కొడాలి నాని

8 May, 2021 13:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కట్టడికై ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపడుతోందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఏపీలో ఒక్క రోజులో 6 లక్షల మందికి టీకాలు వేశామని, మరిన్ని వ్యాక్సిన్లు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే కేంద్రానికి రెండు సార్లు లేఖ రాశారన్నారు. అయినప్పటికీ,  చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులకు ఇవేమీ కనిపించవని, అసత్య ప్రచారాలు చేయడమే వారి పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కన్నా భయంకరమైన లక్షణాలతో నలుగురు వ్యక్తులు ఉన్నారంటూ ఫైర్‌ అయ్యారు.

ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. ‘‘రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేందుకు సిద్దంగా ఉన్నాం. రూ.1600 కోట్లను ఎక్కడి పంపించాలో చెప్పండి.. ఇచ్చేందుకు సిద్ధం. ప్రభుత్వంపై జూమ్‌ యాప్‌లో చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టాలి. ఎవరు చనిపోయినా కరోనాతోనే చనిపోయారని బాబు విష ప్రచారం చేస్తున్నారు. కర్నూలులో ఎన్‌440కే వైరస్ ఉందని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సీబీఎన్‌ 420 అనేది నారావారిపల్లెలో పుట్టింది. చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరుకుంది’’ అని చంద్రబాబు తీరును విమర్శించారు.

కరోనా విజృంభణకు చంద్రబాబు, ఎల్లోమీడియానే కారణమన్న కొడాలి నాని.. రాష్ట్రంలో ఎన్నికలు పెట్టి కరోనా ఉధృతి కారణమయ్యారంటూ మండిపడ్డారు. ‘‘కరోనా చికిత్సకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోంది. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కేసులు పెట్టి జైల్లో ఉంచాలి’’ అని వ్యాఖ్యానించారు.

చదవండి: చంద్రబాబు విష ప్రచారాల వల్లే.. ఇదంతా: సజ్జల

>
మరిన్ని వార్తలు