రేవంత్‌పై నిర్మల వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి

14 Dec, 2022 00:55 IST|Sakshi

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని 

సాక్షి, హైదరాబాద్‌: భాషపై నిండు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అవమానించడం ఏంటని, వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని విచారం వ్యక్తం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఒక సభ్యుని పట్ల అనుచితంగా మాట్లాడటం సమంజసం కాదని మంగళవారం ఒక ప్రకటనలో హితవు పలికారు.

సభ కస్టోడియన్‌గా సభ్యుల హక్కులు, మర్యాదను కాపాడాల్సిన లోక్‌సభ స్పీకర్‌ కూడా రేవంత్‌రెడ్డి రక్షణకు రాకపోగా.. నిర్మలా సీతారామన్‌ను సమర్థించేలా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులకున్న చులకన భావాన్ని ఈ ఘటన తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రేవంత్‌రెడ్డి హిందీలో మాట్లాడటాన్ని హేళన చేయడం సమర్థనీయం కాదన్నారు. అయినా రేవంత్‌రెడ్డి తన భావాన్ని హిందీలో అర్థమయ్యే రీతిలోనే స్పష్టంగా వ్యక్తీకరించారని, ఆయన లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా నిర్మలా సీతారామన్‌ కించపరిచేలా మాట్లాడటం ఏంటని కూనంనేని ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు