మునుగోడు సభకు.. సీఎం కేసీఆర్‌ కారెక్కనున్న చాడ వెంకట్‌రెడ్డి!

20 Aug, 2022 10:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నల్లగొండ: మునుగోడు సమరం తెలంగాణలో మరో ఆసక్తికర పరిణామానికి తెర తీసింది. ఉప ఎన్నిక కోసం.. బీజేపీని బలంగా ఢీకొట్టే టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించాలని వామపక్షాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. 

ఉప ఎన్నిక షెడ్యూల్‌ రాకముందే పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలోకి దిగాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) బహిరంగ సభ నిర్వహించనుంది అధికార టీఆర్‌ఎస్‌. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగబోయే ఈ బహిరంగ సభ నుంచే మద్దతు ప్రకటించాలని, కార్యక్రమానికి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్‌ వాహనంలోనే చాడ.. మనుగోడుకు చేరుకోనున్నట్లు సమాచారం. 

ఇక మునుగోడు సభ కోసం టీఆర్‌ఎస్‌ భారీ ఎత్తున్న కసరత్తులు చేస్తోంది. రెండు వేల మందితో హైదరాబాద్‌ నుంచి ర్యాలీ తీయాలని చూస్తోంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు-ఐదు గంటల వరకు విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి.

మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో సీపీఐ-సీపీఎంలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. కాబట్టి, కాంగ్రెస్‌ ఓట్లు రెండుగా చీలడం ఖాయమని, ఒకవేళ కాంగ్రెస్‌కు వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో.. బీజేపీని ఎదుర్కొనే టీఆర్‌ఎస్‌కు ఇవ్వడం కొంత మంచిదని నిర్ణయించుకున్నాయి.

రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్‌ ఉండగా.. విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: కారు వైపే కామ్రేడ్లు!

మరిన్ని వార్తలు