సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అల్లిపురం (విశాఖ దక్షిణం): జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతులకు మద్దతిస్తారా, లేదంటే బీజేపీకి మద్దతిస్తారో స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమాన్ని చూసి పార్టీ పెట్టా, పోరాడుతా అని చెప్పే పవన్ కళ్యాణ్.. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని, విశాఖలో జరుగుతున్న ఉక్కు పోరాటాన్ని పట్టించుకోకుండా బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీకి ఏ విధంగా మద్దతిస్తారో చెప్పాలన్నారు. బద్వేలులో జనసేన పోటీ చేయబోదని చెప్పి.. బీజేపీకి మద్దతివ్వడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.