పట్నా: బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీల నేతృత్వంలోని మహాకూటమి జోరు పెంచింది. ఎన్డీఏ కూటమి ఇంకా సీట్ల సర్దుబాటులోనే తలమునకలై ఉండగా మహాకూటమి మాత్రం అభ్యర్థులను ప్రకటించేస్తోంది. మహాకూటమి సీట్ల పంపకాల్లో భాగంగా ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, సీపీఐఎంఎల్ 19, సీపీఐ 6, సీపీఎం 4 చోట్ల పోటీ చేయబోతోంది. ఈక్రమంలో తమ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న నలుగురు అభ్యర్థుల పేర్లను సీపీఎం ప్రకటించింది. మతిహనీ, పిప్రా, బిభుటిపూర్, మాఝీ స్థానాల నుంచి రాజేంద్రప్రసాద్, రాజ్మంగళ్ప్రసాద్, అజయ్కుమార్, సతేంద్రయాదవ్ల అభ్యర్థిత్వాలను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
ఇక.. బాఖ్రీ, తెగ్రా, బచ్వారా, హర్లాఖీ, ఝంఝర్పూర్, రూపౌలీ స్థానాల నుంచి సీపీఐ పోటీ చేస్తోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాండేకి హర్లాఖీ టికెట్ లభించగా, సిట్టింగ్ ఎమ్మెల్యే అవదేష్కుమార్ రాయ్ మరోసారి బచ్వారా స్థానం నుంచే పోటీకి దిగుతున్నారు. 2015 ఎన్నికల్లో తెగ్రా, బాఖ్రీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్రతన్సింగ్, సూర్యకాంత్ పాశ్వాన్లు మరోసారి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రూపౌలీ నుంచి వికాస్చంద్రమండల్, ఝంఝర్పూర్ నుంచి నారాయణ్యాదవ్ బరిలోకి దిగుతున్నారు.
(చదవండి: ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం)