‘ఈటలను బలి పశువుని చేస్తున్న కేసీఆర్‌’

1 May, 2021 11:41 IST|Sakshi

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి ఈటల రాజేందర్‌ కబ్జాలకు పాల్పడితే తప్పకుండా శిక్షించాలని, కానీ అంతకంటే ముందు టీఆర్‌ఎస్‌ పార్టీలో శిక్షపడాల్సిన వారు చాలా మందే ఉన్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. కాకపోతే కేసీఆర్‌ తనపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు ఈటలను బలిపశువుని చేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈటలను తప్పించాలనేది కేసీఆర్‌ పన్నాగమని ఆరోపించారు. అలాగే, భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్‌ గౌడ్‌లపై ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించండి 
మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై బండి సంజయ్‌ డిమాండ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. మంత్రులు మల్లారెడ్డితో పాటు కేటీఆర్‌ పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. సీఎం వ్యతిరేక వర్గంపై ఆరోపణలు వస్తే విచారణకు ఆదేశించడం, అనుకూల వర్గాన్ని వదిలేయడం కాకుండా మంత్రి ఈటల రాజేందర్‌ కోరినట్లు అవినీతి ఆరోపణలున్న మంత్రులు, ఎమ్మెల్యేలందరిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాత్రి ఆయన జూమ్‌ ద్వారా మీడియాతో మాట్లాడుతూ...ప్రస్తుతం కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నాకనీసం స్పందించని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.
చదవండి: ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..?

మరిన్ని వార్తలు