రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి... రూ.6,300 కోట్లు వెచ్చించింది

28 Aug, 2022 06:39 IST|Sakshi

బీజేపీపై కేజ్రీవాల్‌ ఆరోపణలు

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఏకంగా రూ.6,300 కోట్లు వెచ్చించిందని శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘బీజేపీ ఆ పని చేయకపోతే ఆహార పదార్థాలపై జీఎస్‌టీ విధించే అవసరమే ఉండేది కాదు. ప్రజలకు ధరాఘాతం తప్పేది’’ అని ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. ‘‘పెట్రోల్, డీజిల్‌పై పన్నులు, జీఎస్‌టీ సొమ్ములను ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ వెచ్చిస్తోంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పడుతుంటే ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోయడంలో బిజీగా ఉంది’’ అన్నారు. బీజేపీలో చేరాలంటూ రూ.20 కోట్లు చొప్పున ఆశ చూపారని ఆప్‌ ఎమ్మెల్యేలు ఇటీవల ఆరోపించడం తెలిసిందే.

అస్సాం సీఎం, కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వార్‌
కేజ్రీవాల్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో, అస్సాంలో సర్కారీ స్కూళ్ల పరిశీలనకు ఎప్పుడు రమ్మంటారని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తోనూ కేజ్రీవాల్‌కు విభేదాలు ముదురుతున్నాయి. కేజ్రీవాల్‌ సంతకాలు లేవంటూ 47 ఫైళ్లను ఎల్జీ తిప్పిపంపారు.

మరిన్ని వార్తలు