‘ఎన్టీఆర్‌ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’

6 Mar, 2023 16:20 IST|Sakshi

విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు భారీగా విజయవంతం కావడం తెలుగుదేశం పార్టీకి గానీ, ఎల్లో మీడియాకు గానీ ఏ మాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. ఏకంగా దేశంలో ఉన్న టాప్‌ క్లాస్‌ బిజినెస్‌ మాగ్నెట్‌లు అంతా రావడం, ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని కొనియాడటం, వేల కోట్ల పెట్టుబడులు పెడతామని నేరుగా ప్రకటించడం.. ఎల్లో బ్యాచ్‌కు మింగుడు పడలేదు.

సాధారణంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారుల సదస్సు జరిగితే అందులో రకరకాల వేషాలు, డ్రామాలు పుట్టుకొస్తాయి. అలాంటి ఓ విచిత్రమైన ఘటనను షేర్‌ చేసుకున్నారు సీనియర్‌ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మంత్రిగా ఉండేవారు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన, ఆయన చెప్పిన అనుభవం ఇది.

"తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఫేక్‌ షోలు చేయడం అలవాటు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం.. ఆయనకు పెద్దగా తెలియదు. ఎప్పుడూ చుట్టూ ఉండే చంద్రబాబు, ఆయన మనుష్యులు ఓ రోజు  ఒకాయనను తీసుకొచ్చారు. నేరుగా ఎన్టీఆర్‌ దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశారు. అయ్యా.. ఈయన భూటాన్‌ రాయబారి అని పరిచయం చేశారు.

ఎన్టీఆర్‌ దానికి ఎంతో సంతోషించారు.. స్వయంగా వెంట తీసుకెళ్లి బుద్ధుడి విగ్రహాం చూపించారు. ఆ వ్యక్తితో ఫోటోలు దిగి పేపర్లో వేయించారు. టుప్కా అని భూటాన్‌ నుంచి రాయబారి వచ్చారని, ముఖ్యమంత్రిని కలిశారని పేపర్లలో ప్రచారం చేయించారు. అప్పట్లో నేను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తుండే వాడిని. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత .. నాతో పని చేస్తోన్న ఓ కొలీగ్‌ ఓ ఫోటో చూపించారు. అందులో నాంపల్లి రైల్వే స్టేషన్‌ దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న వ్యక్తి ఫోటో ఉంది. ఇతనే కదా మొన్న ఎన్టీఆర్‌ను కలిసిన భూటాన్‌ రాయబారి అని చెప్పారు. తెలుగుదేశం వాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారు. స్వెట్టర్లు అమ్ముకునే వ్యక్తిని భూటాన్‌ రాయబారి అని చెప్పించిన ఘనత చంద్రబాబుది.." అని  దేవులపల్లి అమర్‌ అన్నారు.
చదవండి: జాకీ యూనిట్‌పై రాప్తాడులో టీడీపీ కాకిగోల.. వాస్తవాలతో సాక్ష్యం ఇదిగో

మరిన్ని వార్తలు