KCR Bihar Tour: అవమానానికి గురయ్యేందుకేనా బిహార్ వెళ్లింది.. బీజేపీ నేతల సెటైర్లు

2 Sep, 2022 09:35 IST|Sakshi

పట్నా: బిహార్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ లేచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ పలుమార్లు కూర్చొమని చెప్పినా ఆయన అసలు పట్టించుకోలేదు. చివరకు కేసీఆర్ నితీశ్‌ కుమార్ చేయి పట్టుకుని కూర్చోమని విజ్ఞప్తి చేసిన తర్వాత ఆయన బలవంతంగా కుర్చీలో కూర్చున్నారు.

బుధవారం పాట్నాలో కేసీఆర్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు జాతీయ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును మీరు ప్రతిపాదిస్తారా? అని ఓ విలేకరి కేసీఆర్‌ను అడిగారు. ఇందుకు ఆయన బదులిస్తూ.. నితీశ్ కుమార్‌ పేరు ప్రతిపాదించడానికి నేను ఎవర్ని? నేను చెప్తే ఎవరూ వ్యతిరేకించరా? అందరం కలిసి దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పుడే తొందర ఎందుకు? అని బదులిచ్చారు. ఈ సమయంలోనే నితీశ్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ఇలా అవమానానికి గురయ్యేందుకేనా తెలంగాణ నుంచి బిహార్ వెళ్లింది అని? సెటైర్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతుంటే కనీస మర్యాద లేకుండా నితీశ్ కుమార్ వెళ్లిపోయారు అని పేర్కొన్నారు.

 మరో బీజేపీ నేత సుశీల్ మోదీ కూడా ఈ ఘటనపై స్పందించారు. విపక్షాల అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తారనే ఆశతోనే కేసీఆర్‌ను నితీశ్ బిహార్‌కు ఆహ్వానించారని, కానీ అలా జరగకపోయేసరికి మీడియా  సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారని విమర్శలు గుప్పించారు.
చదవండి: కొన్ని పార్టీల తీరు దారుణం.. ఇదో కొత్త రకం రాజకీయ ఏకీకరణ

మరిన్ని వార్తలు