కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: దిగ్విజయ్ సింగ్‌

30 Sep, 2022 12:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజున అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పోటీ చేస్తారని భావించిన  దిగ్విజయ్ సింగ్‌ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే పోటీ చేసున్నందునే తాను బరిలో నిలవడం లేదని చెప్పారు. ఖర్గేకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

దిగ్విజయ్ సింగ్ నిర్ణయంతో ఇప్పుడు పోటీ శశిథరూర్, ఖర్గే మధ్యే ఉండనుంది. ఇద్దరు కాసేపట్లో అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ సమర్పిస్తారు. గాంధీ కుటుంబం విధేయుడిగా పేరున్న ఖర్గేనే విజయం సాధించే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అని మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్ జీ-23నేతలు బరిలో నిలవద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీ చేస్తానని జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠి ప్రకటించారు. మధ్యాహ్నం నామినేషన్ సమర్పిస్తానని చెప్పారు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని సోనియా గాంధీ చెప్పారని పేర్కొన్నారు.

ఈ సారి గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వారు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 1994లో పీవీ నరసింహారావు చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు శశిథరూర్, ఖర్గేలో ఎవరు గెలిచినా మరోసారి ఆ పదవి చేపట్టిన దక్షిణాది నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. వీవీ నరసింహారావు తర్వాత 1996-98 వరకు సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి 2017వరకు సోనియా గాంధీనే ఆ పదవిలో కొనసాగారు.
చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు

మరిన్ని వార్తలు