‘పెళ్లి కాలేదంటున్నావ్‌.. గర్భవతివి ఎలా అయ్యావ్‌?’

11 Jun, 2021 14:03 IST|Sakshi

టీఎంసీ ఎంపీ నుస్రత్‌ జహానపై దిలీప్‌ ఘోష్‌ విమర్శలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ టీఎంసీ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ పెళ్లిపై రేగిన వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. ఈ క్రమంలో నుస్రత్‌ వ్యవహారంపై బెంగాల్‌ బీజేపీ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్‌ బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌.. నుస్రత్‌ జహాన్‌ పెద్ద మోసగత్తె.. పెళ్లి కాలేదని చెప్తున్న ఆమె.. నుదుటన సింధూరం ఎందుకు ధరిస్తున్నారు అని ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. ‘‘ఎంత మోసం.. టీఎంసీ టికెట్‌ ఇచ్చింది ఆమెకు.. పార్లమెంట్‌ సాక్షిగా ఆమె తనకు వివాహం అయ్యిందని ప్రమాణ స్వీకారం చేసింది. కానీ ఇప్పుడు ఆమె తనకు వివాహామే కాలేదంటుంది. అయినప్పటికి ఈమె గతంలో సింధూరం ధరించింది.. రథ యాత్రలో పాల్గొంది.. పూజలు చేసింది... ఎన్నికల్లో గెలిచింది. జనాలను ఎంత మోసం చేసింది’’ అంటూ విమర్శించారు. 

2019 లో కోల్‌కతాలో ఇస్కాన్ నిర్వహించిన రథయాత్రలో నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ దంపతులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో దిలీప్‌ ఘోష్‌ రథయాత్ర గురించి ప్రస్తావిస్తూ.. నుస్రత్ జహాన్‌ను నిందించడమే కాక, 2019 లో నుస్రత్, నిఖిల్ రిసెప్షన్‌కు హాజరైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా నిందించారు.

"వివాహామే చేసుకోలేదని ప్రకటించిన ఓ వ్యక్తి పెళ్లికి మమతా బెనర్జీ ఎలా హాజరయ్యారు. ఆమె తనకు పెళ్లి కాలేదని అంటుంది.. కానీ నుదుటున సింధూరం ధరిస్తుంది.. జనాలు ఆమె గర్భవతి అయ్యిందంటున్నారు. అసలు ఏంటి ఈ మోసం’’ అని ఆయన ప్రశ్నించారు. నుస్రత్ జహాన్ బుధవారం వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో తన వివాహం చట్టబద్ధమైనది కాదని, టర్కీలో జరిగిన వారి వివాహానికి భారత చట్టంలో గుర్తింపు లేనందున లైవ్-ఇన్ రిలేషన్ మాత్రమే అని తెలిపారు. కొంతకాలంగా నుస్రత్‌ జహాన్‌ నటుడు యష్ దాస్‌గుప్తాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిసిస్తున్నాయి. 

చదవండి: 
భర్తతో విడిపోవడంపై టీఎంసీ ఎంపీ నుస్రత్‌ కీలక వ్యాఖ్యలు
వైరల్‌: పి. మమతా బెనర్జీ వెడ్స్‌ ఏఎం సోషలిజం...

మరిన్ని వార్తలు