అచ్చెన్న నియామకంపై టీడీపీలో అసంతృప్తి
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయి బెయిల్పై బయట ఉన్న అచ్చెన్నాయుడికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అవినీతిలో కూరుకుపోయిన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వడం ఏమిటని పార్టీ సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి వ్యవహారంలో పక్కాగా దొరికిన వ్యక్తిని అందలం ఎక్కించడం దేనికి సంకేతమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
లోకేష్ తనకు అనుకూలంగా ఉండే వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో అచ్చెన్నకు పదవిపై చంద్రబాబు చాలా రోజులు నాన్చుతూ వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు అధ్యక్షులను ప్రకటించడం, బీసీల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుండటంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు హడావుడిగా అచ్చెన్న పేరు ప్రకటించినట్లు పేర్కొంటున్నారు. కాగా, పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీలో సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం ఇవ్వడం, ఒక్కరికే రెండు పదవులు ఇవ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.