Uddhav Thackeray: సీఎం–గవర్నర్‌ మధ్య పెరిగిన దూరం? రెండేళ్లలో కలుసుకున్నది రెండుసార్లే

23 Mar, 2022 14:56 IST|Sakshi
ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ

సాక్షి, ముంబై: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌కు, ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రికి మధ్య ఉండాల్సిన సత్సంబంధాలు అంత సహృద్భావంగా లేవని, వారిద్దరి మధ్య దూరం పెరిగిందని గతంలో జరిగిన పలు సంఘటనల వల్ల తెలుస్తోంది. ఉద్దవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి.. అంటే గత రెండు సంవత్సరాల నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య కేవలం రెండంటే రెండుసార్లు మాత్రమే పరస్పర మర్యాదపూర్వకమైన భేటీ జరగడం గమనార్హం.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే శాసన మండలికి ఎంపిక కావడం, 12 మంది శాసన మండలి సభ్యులను నియమించడం, ప్రభుత్వ విమానాన్ని వాడుకోవడం, శాసన సభ అధ్యక్షుడి ఎన్నిక లాంటి కొన్ని అంశాల పట్ల గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ వ్యవహరించిన తీరుపట్ల ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోందని తెలుస్తోంది.

పలు సందర్భాల్లో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, శివసేన నాయకుడు సంజయ్‌ రావుత్‌తో పాటు, ఎన్సీపీ అధ్యక్షులు శరద్‌ పవార్‌ కూడా గవర్నర్‌ వ్యవహార శైలిని అక్షేపించా రు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా, గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు, చర్చలు, సత్సం బంధాలు ఉంటాయి. పరస్పరం మర్యాదçపూర్వకం గా కలుసుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. కానీ, గత రెండు సంవత్సరాల కాలంలో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లుగా కనిపిస్తోంది. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ 2019 నవంబర్‌ 28వ తేదీన ఉద్ధవ్‌ ఠాక్రేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. వారిద్దరి మధ్య అదే మొదటి కలయిక.
చదవండి: ముఖ్యమంత్రి బావమరిదిపై ఈడీ కేసు.. రూ. 6.45 కోట్ల ఆస్తులు సీజ్‌ 

ఆ తర్వాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మహాపరినిర్వాణ రోజైన 2019 డిసెంబర్‌ ఆరవ తేదీన దాదర్‌లోని చైత్యభూమిలో రెండవసారి కలుసుకున్నారు. ఆ తరువాత 1 జనవరి, 2020న శాసన సభ మొదటి సమావేశాల్లో శాసన సభ ప్రాంగణంలో మూడవసారి కలుసుకున్నారు. 3 జనవరి 2020న ఠాక్రేల నివాసస్థానమైన మాతోశ్రీ భవనంలో జరిగిన ఒక విందుభోజనంలో గవర్నర్‌ కోశ్యారీ పాల్గొన్నారు. అది ఠాక్రేతో నాలుగవ కలయిక. 20 జనవరి, 2020న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజ్‌భవన్‌ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది ఆ ఇద్దరి మధ్య జరిగిన మొదటి మర్యాదపూర్వకమైన సమావేశం. దాని తర్వాత 9 ఫిబ్రవరి రోజు మరోసారి ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లోనే రెండవసారి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఆ సమావేశం తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగి ఇంతవరకు మూడవ మర్యాదపూర్వకమైన భేటీ, సమావేశం ఇంతవరకు జరగలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయనే సంకేతాలు రాజకీయవర్గంలో చర్చనీయాంశమయ్యా యి. గత రెండుంపావు సంవత్సరాల కాలంలో రెండుసార్లు తప్ప ముఖ్యమంత్రి, గవర్నర్‌ల మధ్య నేరుగా మర్యాదపూర్వకమైన భేటీ జరగలేదు. 

అనధికారికంగా 30సార్లు భేటీ..
వీరిద్దరు ప్రజావేదికలపైన, ప్రభుత్వ కార్యక్రమాల్లో దాదాపు 30 సార్లు కలుసుకున్నారు. ఇందులో ప్రముఖంగా రిపబ్లిక్‌ డే ఉత్సవాలు, మహారాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాలు, శాసన మండలి సమావేశాల ప్రారంభంలో, మంత్రివర్గ ప్రమాణస్వీకారం సమయంలో, లోకాయుక్త ప్రమాణ సందర్భంలో, ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్వాగత సమయంలో, ఇలాంటి పలు సందర్భాల్లో కలుసుకున్నప్పటికీ మర్యాదపూర్వకంగా మాత్రం రెండుసార్లు మాత్రమే కలుసుకున్నారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే తండ్రి మాధవరావ్‌ పాటన్కర్‌ చనిపోయినప్పుడు గవర్నర్‌ కోశ్యారీ మర్యాదపూర్వకంగా మాతోశ్రీ భవనానికి వెళ్ళి రశ్మి ఠాక్రేను ఓదార్చి వచ్చారు. 17 జూన్‌ 2021 నాడు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజ్‌భవన్‌ వెళ్ళి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. ఇలాంటి కొన్ని సందర్భాలు తప్ప అధికారికంగా సహద్భావ వాతావరణంలో వారిద్దరి మధ్య ఎలాంటి సమావేశాలు జరగడం లేదు. 

మరిన్ని వార్తలు