‘టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌’

18 Sep, 2020 18:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని భయపడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. శనివారం ‘జూమ్’లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... 2019 డిసెంబర్‌ నాటికే 2 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని టీఆర్‌ఎస్‌ చెప్పిందని గుర్తు చేశారు. జీహచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో బీజేపీ ముందు ఉండి.. టీఆర్‌ఎస్‌ పార్టీ వెనుకబడిపోతుందన్న సమాచారం సీఎం కేసీఆర్‌కు ముందుగానే వచ్చిందన్నారు. రెండు రోజులు జీహెచ్‌ఏంసీ పరిధిలో పర్యటించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డబుల్ బెడ్ రూం ఇండ్ల క్వాలిటీపై మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమన్నారు. మళ్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆరెస్-కాంగ్రెస్ కలుస్తందనడానికి ఇదే సంకేతమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ లేదని తానే స్వయంగా పరిశీలించానని చెప్పారు. బీజేపీని ఎదురుకోలేక కాంగ్రెస్-టీఆర్‌ఎస్‌ కలిసి తిరుగుతున్నాయని, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని కేటీఆర్ ఉరుకులాడుతున్నాడరని అరుణ విమర్శించారు.

బీజేపీకి భయపడే అధికార టీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష కాంగ్రెస్‌తో కలిసిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని భావించే కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌ పెంచిపోషిస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,‌ టీఆర్‌ఎస్‌ కలిసి పోటీచేసేటట్లు కనిపిస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌లు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో టీఆర్‌ఎస్‌ వైఫల్యం చెందిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని పేర్కొన్నారు. ఎక్కడ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నాయో ప్రకటన చేయాలన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ప్రధాన మంత్రిని విమర్శించే స్థాయి తలసానికి లేదని ఆమె మండిపడ్డారు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక గాలులు విస్తున్నాయన్నారు. సీఎం అనుమతి లేకుండా తలసాని.. భట్టి ఇంటికి వెళ్లగలరా అని డీకే అరుణ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు