వాళ్లకు పూలు.. మాకు బుల్డోజర్లా?: యోగి సర్కార్‌పై ఒవైసీ కామెంట్లు

27 Jul, 2022 13:17 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ సర్కార్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అసంతృప్తి వెల్లగక్కారు. కన్వర్‌ యాత్ర సందర్భంగా.. కన్వరియాల మీద పూలు జల్లడం కోసం ప్రభుత్వ నిధుల్ని వెచ్చించడాన్ని,  భక్తులకు పోలీసుల కాళ్లు నొక్కి, పూలతో స్వాగతం పలుకుతూ సేవలు చేయడానికి అధికారుల్ని సర్కార్‌ నియమించడాన్ని ఒవైసీ తప్పుబట్టారు. 

ఒకవైపు యూపీ ప్రభుత్వం కన్వర్‌ యాత్ర కోసం పూలు జల్లేందుకు అధికారుల్ని నియమిస్తోంది. ఎక్కడ చూసిన అవే కథనాలు కనిపిస్తున్నాయి. సంతోషం.  అదే సమయంలో ముస్లింల ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లను అదే అధికారులతో పంపిస్తోంది. ముస్లింలు తమ మీద పూలు చల్లమని కోరుకోవడం లేదు.. కనీసం బుల్డోజర్లను తమవైపు పంపించొద్దని కోరుకుంటున్నారు. 

బహిరంగ ప్రాంతాల్లో కొన్ని నిమిషాలపాటు ముస్లింలు నమాజ్‌ చేస్తే.. నానా రభస చేస్తున్నారు. అదొక రచ్చ అవుతోంది. పోలీస్‌ కేసులు, బుల్లెట్లు, ఘర్షణలకు కారణం అవుతోంది. ఎన్‌ఎస్‌ఏ, యూఏపీఏ, మూకదాడులు-హత్యలు ఇవన్నీ ముస్లింలకేనా? అని ప్రశ్నించారు ఒవైసీ. లూలూ మాల్‌ వ్యవహారం తర్వాత యూపీలో చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లు చేసేవాళ్లను అరెస్ట్‌ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలోనే ఎంపీ ఒవైసీ ఇలా అసహనం వ్యక్తం చేశారు. 

కన్వరియాల మనోభావాలు చాలా బలంగా ఉంటాయి. వారు ముస్లిం పోలీసు అధికారి పేరును కూడా సహించలేరు. ఎందుకు ఈ భేదం? ఒకరిని ద్వేషించి మరొకరిని ఎందుకు ప్రేమించాలి? ఒక మతం కోసం ట్రాఫిక్‌ను మళ్లించి, మరో మతానికి బుల్‌డోజర్లను ఎందుకు మళ్లించారు అంటూ ట్విటర్‌లో పోస్టులు చేశారు ఒవైసీ. 

ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు 

మరిన్ని వార్తలు