‘మీ జాతకాలను వీడియోల సాక్షిగా చూపిస్తాం’

4 Feb, 2021 18:36 IST|Sakshi

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌

సాక్షి, తాడేపల్లి : టీడీపీ సభ్యులు పార్లమెంటు వేదికగా అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో నంది విగ్రహం మార్చి పెట్టాలని ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అలాంటి వారిని అరెస్ట్ చేస్తే తప్పా అని నిలదీశారు. మీరేం చేసినా పట్టించుకోకుంటే మంచిదా అని ప్రశ్నించారు. తప్పులు చేస్తూ అన్ని చోట్లా దొరికారని.  దానిలో సరైన సాక్షాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే ఇస్తున్నామని పేర్కొన్నారు. వీళ్ళందరి జాతకాలను వీడియో సాక్షిగా కేంద్రానికి తెలుపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత మార్పిడిలు ఎక్కడ జరుగుతున్నాయని పిర్యాదు చేశారని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా మత కలహాలు జరిగిన చరిత్ర ఉందా అని నిలదీశారు. చదవండి: టీడీపీ ఎంపీలు కాళ్ల బేరానికి వెళ్లారు..

రాజకీయంగా ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు మత కలహాలు అనడం మీరు(టీడీపీ) బతకడం కోసమేనని డొక్కా దుయ్యబట్టారు. టీడీపీ పార్టీ నుంచి చాలా మంది వలస వెళ్లిపోతున్నారన్న ఆయన దాన్ని ఒప్పుకోడానికి మనసు ఒప్పక మతకలహాలు అనడం దివాళా కోరు పద్ధతని విమర్శించారు. అమిత్ షాకి ప్రవీణ్ చక్రవర్తి వీడియో చూపించారని, ఒకవేళ అది టీడీపీ హయాంలో జరిగితే దాన్ని అమిత్ షాకి చూపుతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంలో తాము వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. పాస్టర్‌ ప్రవీణ్ చక్రవర్తిని ఎవరు అరెస్ట్ చేశారో? అప్పుడు మీరెందుకు అరెస్ట్ చేయలేదని, మోదీపై మీరు ఏవిధంగా మాట్లాడారో ఆ వీడియోలను కూడా బీజేపీకి అందిస్తామని హెచ్చరించారు. అమిత్ షాపై దాడి చేసిందేవరో కూడా వివరిస్తామని అన్నారు. లేనివి ఉన్నవిగా ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలని టీడీపీ నేతలకు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ హితవు పలికారు.

‘మోదీకి కుటుంబం లేదని మాట్లాడింది మీరు కాదా. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మీరు రెచ్చగొడుతున్నారు. విజయవాడలో 40 దేవాలయాలు కూల్చింది మీరు కాదా. FRBM అనుమతి లేకుండా అప్పు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ అనుమతి లేకుండా చట్టానికి లోబడకుండా ఎవరైనా అప్పులు ఇస్తారా. ఏ రాష్ట్రమైనా, కేంద్రమైనా అప్పులు తెస్తుంది. నీ హయాంలో కూడా అప్పులు తెచ్చిన మాట మర్చిపోవద్దు. పోలవరం గురించి మాట్లాడే అర్హత వీళ్లకు ఉందా...?అది ఎక్కడ పూర్తి అయ్యి సీఎం జగన్‌కు మంచి పేరువస్తుందో అని ఆగిపోయిందని ఆరోపణలు చేస్తున్నారు. కళ్ళజోళ్ళు ఇస్తాం....ఒకసారి వెళ్లి చూసి రండి. జీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. వాస్తవాలు తెలుసుకోవాలి. కావాలంటే డేటా పంపుతాం. టీడీపీ హయాంలో జరిగిన డేవాలయాలపై దాడుల విషయంపై మీకు సమాచారం లేదా. దేశంలో రాష్ట్ర గౌరవం పెంచేలా మాట్లాడాలి కానీ చెడ్డపేరు వచ్చేలా మాట్లాడటం సరికాదు’ అంటూ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావును ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు