Dalitha Avedana Deeksha: టీఆర్‌ఎస్‌కు దళితులు ఓటేయొద్దు

27 Jun, 2021 07:45 IST|Sakshi
ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మహారాష్ట్ర మంత్రి నితిన్‌ రావత్‌ను సన్మానిస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ప్రీతమ్‌.... చిత్రంలో ఉత్తమ్, భట్టి, సంపత్, గీతారెడ్డి తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని దళితులు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయొద్దని ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మహారాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి నితిన్‌ రావత్‌ పిలుపునిచ్చారు. దళితులకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు నిరసనగా.. దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ను ఖండి స్తూ శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో ‘దళిత ఆవేదన దీక్ష’జరిగింది. రాష్ట్ర ఎస్సీ సెల్‌ చైర్మన్‌ నాగరిగారి ప్రీతమ్‌ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షకు ముఖ్య అతిథిగా హాజరైన నితిన్‌ రావత్‌ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్‌ ఎన్నో కలలు కన్నారని, ఈ కలలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్‌ శ్రేణులు ఊరూరా తిరిగి పోరాటం చేయాలని, దళితులను చైతన్యవంతులను చేయాలని సూచించారు.

మరియమ్మ లాకప్‌డెత్‌ దురదృష్టకరమని, కనీసం మహిళా పోలీసుల రక్షణ లేకుండా ఆమెను కొట్టి చంపడం దారుణమన్నారు. ఆమె మృతికి కారణమైన పోలీసులను సస్పెండ్‌ చేస్తే చనిపోయిన మరియమ్మ బతికొస్తుందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడేళ్లుగా దళితుల బాగు గురించి ఆలోచించని సీఎం ఇప్పుడు దళిత సాధికారత అని మాట్లాడటం సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ విమ ర్శించారు. ఒక్కరయినా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రి పదవిలో ఉన్నారా అని ప్రశ్నించారు.  

అందరికీ న్యాయం చేయాలి... 
రాష్ట్రంలో అన్యాయానికి గురైన దళితులందరికీ న్యా యం జరగాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాము గవర్నర్‌ను కలిసి వస్తుంటే సీఎం కార్యాలయం నుంచి కబురు వచ్చిందని, మరియమ్మ కుటుంబానికి న్యాయం చేసేందుకే సీఎంను కలిశామని చెప్పారు. దళిత మహిళకు జరిగిన అన్యాయం గురించి సీఎంను కలసిన తమను టీఆర్‌ఎస్‌కు బీటీం అని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడానికి సిగ్గుండాలన్నారు. దళితులకు ఎప్పుడూ అండగా ఉండేది కాంగ్రెస్‌ పార్టీనేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మరియమ్మకు నివాళులు అర్పించారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, సంపత్‌కుమార్, మల్లు రవి, దాసోజు శ్రావణ్, గీతారెడ్డి, బలరాం నాయక్, బొల్లు కిషన్, మానవతారాయ్, నమిళ్ల శ్రీనివాస్‌తో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు