దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత

6 Oct, 2020 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక శాసనసభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత పేరును పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి కేసీ ఆర్‌ ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన సోలి పేట రామలింగారెడ్డి ఉద్యమం, పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్దికి చివరిశ్వాస వరకు కష్టపడి పనిచేశారు. రామలింగారెడ్డి కుటుంబం మొత్తం అటు ఉద్యమం, ఇటు నియోజకవర్గ అభివృద్దిలో పాలుపంచుకుంది.

నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో రామలింగారెడ్డి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన భార్య సుజాతను అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం’అని సీఎం పేర్కొన్నారు. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా అమలు చేసేందుకు సోలిపేట రామలింగారెడ్డి కుటుంబసభ్యులు దుబ్బాకకు ప్రాతినిధ్యం వహించడం సమంజసమని కేసీఆర్‌ అన్నారు. జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని తెలిపారు. 

రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక 
పాత్రికేయునిగా పనిచేస్తూ 2004లో దొమ్మా ట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన సోలిపేట రామలింగారెడ్డి విజ యం సాధించారు. 2008లో జరిగిన ఉప ఎ న్నికలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలుపొందా రు. నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పా టైన దుబ్బాక నుంచి 2009లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన రామలింగారెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందారు. నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన రెండు పర్యాయాలు అసెంబ్లీ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఈ ఏడాది జూన్‌ లో అనారోగ్యానికి గురైన రామలింగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు ఆరో తేదీన మరణించారు. నవంబర్‌ 3న పోలింగ్‌ జరిగే దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఈ నెల 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 

భర్త: దివంగత సోలిపేట రామలింగారెడ్డి 
పుట్టిన తేదీ: 01–01–1969  
వివాహం: 26–12–1986 
విద్యార్హత: ప్రాథమిక విద్య 
కుమారుడు: సతీష్‌రెడ్డి 
కూతురు: ఉదయశ్రీ 
గ్రామం: చిట్టాపూర్, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా. 

మరిన్ని వార్తలు