దుబ్బాక: అందరూ ఆశల పల్లకీలో!

4 Nov, 2020 02:55 IST|Sakshi

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ సరళిపై పార్టీల లెక్కలు

తామే గెలిచి తీరుతామనే ధీమాలో టీఆర్‌ఎస్, బీజేపీ

దీటైన పోటీ ఇచ్చామని లెక్కలు వేస్తున్న కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌: గత నెల 9న నామినేషన్ల స్వీకరణతో ప్రారంభమైన దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నిక ప్రక్రియలో మంగళవారం జరిగిన పోలింగ్‌తో కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుండగా ప్రచారం తీరుతెన్నులను పోలింగ్‌ సరళి, గెలుపోటములపై ప్రధాన రాజకీయ పక్షాలు విశ్లేషణ జరుపుకుంటున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామనే ధీమా టీఆర్‌ఎస్‌ శిబిరంలో కనిపిస్తుండగా బీజేపీ, కాంగ్రెస్‌లు ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 6న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్‌ నుంచి దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు సహా మొత్తం 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలోకి దిగారు. నామినేషన్ల షెడ్యూల్‌కు ముందే టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ పోటాపోటీ ప్రచారపర్వంలో అడుగుపెట్టగా కాంగ్రెస్‌ మాత్రం అభ్యర్థి ఖరారులో కొంత ఆలస్యం చేసింది. టీఆర్‌ఎస్‌ ప్రచార బాధ్యతలను ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఒంటిచేత్తో నిర్వహించగా కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార సారథ్యం వహించారు. 

గెలుపు తథ్యం: టీఆర్‌ఎస్‌  
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో 2014 మినహా వరుస ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. ప్రస్తుత ఉప ఎన్నికలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమకు ఓటింగ్‌ రూపంలో కలిసి వచ్చాయని టీఆర్‌ఎస్‌ శిబిరం అంచనా వేస్తోంది. లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తామని పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించినా ప్రచారం సందర్భంగా బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌ గట్టి పోటీ ఎదుర్కొంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండగా మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. ఆరేళ్లలో దుబ్బాక నియోజకవర్గంలో రూ. 7 వేల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 78 వేల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కుటుంబాలు తమకు అనుకూలంగా ఓటు వేశాయని టీఆర్‌ఎస్‌ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు దుబ్బాకలో మకాం వేసినా క్షేత్రస్థాయిలో తమకు ఉన్న పార్టీ యంత్రాంగం కలసి వచ్చిందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చేసిన హడావుడి ఎంతమేర ప్రభావం చూపిందనే అంశాన్ని టీఆర్‌ఎస్‌ విశ్లేషించుకుంటోంది. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లోనూ తమదే పైచేయిగా ఉంటుందని అంచనాకు వచ్చింది. 

విజయం నల్లేరు మీద నడక: బీజేపీ 
ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడక ముందే ప్రచార పర్వంలోకి దిగిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు తర్వాతి కాలంలో పార్టీ రాష్ట్రస్థాయి యంత్రాంగం కూడా తోడైంది. చాలా గ్రామాల్లో కనీస స్థాయిలో కేడర్‌ కూడా లేని బీజేపీ ప్రచారపర్వంలో మెరుగైనట్లు లెక్కలు వేసుకుంటోంది. తొలుత యువత తమకు అనుకూలంగా ఉందనే లెక్కలతో బరిలోకి దిగిన బీజేపీ... ప్రచారపర్వంలో బీడీ కార్మికులు, మహిళలు, మధ్యతరగతి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ప్రచారం అనుకూలిస్తుందనే అంచనాలో ఉంది. గతంలో రెండు పర్యాయాలు ఓటమి చవిచూసిన రఘునందన్‌... ఈసారి ఓటర్లలో తనపై కొంత సానుభూతి ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్, సిద్దిపేట, హైదరాబాద్‌లో డబ్బు పట్టుబడటం వంటి పరిణామాలతో పార్టీపై సానుభూతి పెరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభంలో రెండో స్థానానికి పరిమితమవుతామని భావించిన బీజేపీ... మంగళవారం జరిగిన పోలింగ్‌ సరళి తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తిందని భావిస్తూ గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. 

చాప కింద నీరులా ఫలితం: కాంగ్రెస్‌ 
దుబ్బాకలో తాము చాప కింద నీరులా చేసిన ప్రచారం కలిసి వస్తుందని, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితం సాధిస్తామని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సహా పార్టీ ముఖ్య నేతలందరూ నియోజకవర్గంలో మకాం వేసి చేసిన ప్రచారం కలసి వస్తుందనే ధీమాతో ఉంది. అయితే అధికార టీఆర్‌ఎస్‌కు ఉండే అనుకూలత, బీజేపీ దూకుడుకు తగ్గట్టు తాము హడావుడి చేయలేకపోయామనే చర్చ కూడా కాంగ్రెస్‌లో జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే అంశాన్ని చెప్పగలిగామని, కానీ బీజేపీ మాత్రం హడావుడికి మాత్రమే పరిమితం అయిందని చెబుతున్నారు. గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్‌ కేడర్‌ను పదిలపరచుకోవడంతోపాటు తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలన్న తమ వ్యూహం ఫలించినట్టేనన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. పోలింగ్‌ రోజున ఏకంగా పార్టీ అభ్యర్థి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోతున్నారంటూ సోషల్‌ మీడియా వేదికగా జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో సఫలీకృతం అయ్యామన్న ధీమా కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది.   

మరిన్ని వార్తలు