‘వారిద్దరూ తోడు దొంగలు’

29 Oct, 2020 08:11 IST|Sakshi
బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామంలో వాలీబాల్‌ ఆడుతున్న ఉత్తమ్‌

హరీశ్, రఘునందన్‌ బంధువులే : పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

ఓటర్లను ఆగం చేసేందుకు కొత్త నాటకాలు

ప్రజలు గందరగోళానికి గురి కావొద్దని విజ్ఞప్తి

దుబ్బాక రూరల్‌: మంత్రి హరీశ్‌రావు, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తోడు దొంగలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. వారిద్దరూ బంధువులేనని, ఓటర్లను ఆగం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. బుధవారం దుబ్బాక మండలంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలసి పలుచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఓటర్లను తికమక పెట్టేందుకు వారిద్దరూ కలసి అద్భుతమైన స్క్రిప్టు తయారు చేశారని విమర్శించారు. ప్రజలెవరూ గందర గోళం పడాల్సిన అవసరం లేదన్నారు.బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై అత్యాచారం కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఆయన విపరీతంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. దుబ్బాక, సిద్దిపేట తనకు రెండు కళ్లు అని హరీశ్‌రావు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంత వరకు అమలు చేయలేదని విమర్శించారు. రుణమాఫీ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు రావాలంటే టీఆర్‌ఎస్‌ను ఓడించాలని, అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కిందికి దిగి వస్తారన్నారు. 

నిరుద్యోగులతో చెలగాటం  
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, కానీ తన కుటుంబంలో కుమారు డు, అల్లుడికి మంత్రి పదవులు కట్ట్టబెట్టారని ఆరో పించారు. నిరుద్యోగులకు మాత్రం మొండిచెయ్యి చూపారని దుయ్యబట్టారు. తమ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.  

మరిన్ని వార్తలు