కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో ఓట్లు లెక్కిస్తారేమో : విజయశాంతి

28 Oct, 2020 19:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. హరీశ్‌రావు మాటలు వింటుంటే.. దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత, కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో ఈవీఎం మిషన్లు పెట్టి ఓట్లను లెక్కిస్తారేమో అనే అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్ పార్టీ, ముఖ్యంగా హరీశ్‌రావు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదని ఫేస్‌బుక్‌లో ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీశ్‌ రావు మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారేమోనన్న చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే.. దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు