సుజాతను ఎందుకు బరిలో నిలిపారు..?

15 Oct, 2020 18:10 IST|Sakshi

నామినేషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి

సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను సమర్పించగా.. గురువారం కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యనిర్వహఖ అధ్యక్షుడు ఎంపీ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి కుమారుడిని కాదని ఆయన భార్య సుజాతను ఎందుకు నిలబెట్టారని ప్రశ్నించారు. సీనియర్‌ నేతగా, ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన రామలింగారెడ్డిగా సీఎం కేసీఆర్‌ మంత్రిపదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. (ఇద్దరు సీనియర్ల మరణం.. సానుభూతి ఎవరికి?)

అంతేకాకుండా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తొలినుంచి అనుసరిస్తోందని గుర్తుచేశారు. సాంప్రదాయానికి విరుద్ధంగా గతంలో ఖైరతాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌, పాలేరు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ అభ్యర్థులను నిలబెట్టారని విమర్శించారు. ఆణిముత్యం లాంటి ముత్యంరెడ్డి కొడుకును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దుబ్బాకలో శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించి ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల పని చేయాలని పిలపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు