దుబ్బాక ఉప ఎన్నిక: నామినేషన్‌ దాఖలు చేసిన సుజాత

14 Oct, 2020 13:56 IST|Sakshi
దుబ్బక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా నామినేషన్ వేసిన సొలిపేట సుజాత, పాల్గొన్న మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి

సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టిక్కెట్‌ కేటాయించడం తెలిసిందే. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్‌తో కలిసి బుధవారం రిటర్నింగ్ అధికారికి సోలిపేట సుజాత తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా... 17న పరిశీలన, 19వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు.
(చదవండి : దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్‌!)

హుజూర్ నగర్ పలితాలే దుబ్బాకలో రాబోతుంది : హరీశ్‌
కాంగ్రెస్‌, బీజేపీ అభివృద్ధి నిరోధకులుగా మారారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అడుగడున అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. హుజూర్‌నగర్‌ ఫలితాలే దుబ్బాకలో రాబోతున్నాయని జోస్యం చెప్పారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్‌ రాలేదని, దుబ్బాకలో కూడా అదే ఫలితాలు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఏ గ్రామానికి వెళ్లిన అపూర్వ స్వాగతం లభిస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు