టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్.. దొందూ దొందే!

30 Oct, 2020 15:56 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పనుందని పేర్కొన్నారు. సిద్ధిపేట మండల కేంద్రలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఉద్యమ సమయంలో బీజేపీ మహబూబ్‌నగర్‌లో గెలిచినట్లే దుబ్బాకలో కూడా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు, బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ సరళి ఉండనుందని అభిప్రాయపడ్డారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కుట్రలు, దుర్వినియోగంతో గెలవాలని చూస్తుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే..

ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత వస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. కింద పడ్డ మాదే పైచేయి అన్నట్లు అధికార పార్టీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీపై విషప్రచారం చేస్తున్నారని, కేంద్ర నిధుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 1200 మంది ఆత్మహత్య చేసుకున్నది ఒక కుటుంబం కోసం కాదని, దుబ్బాకపై టీఆర్‌ఎస్‌ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూడాలని కోరారు. కాంగ్రెస్ పోటీలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని, కాంగ్రెస్ తరుపున సగం మందికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్న కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ బొమ్మా, బొరుసు లాంటి వారేనని, దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. చదవండి: దుబ్బాక ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది

మరిన్ని వార్తలు