ప్రజల గుండెల్లో నన్ను చెరపడం జేజమ్మ తరం కూడా కాదు

24 Jul, 2021 15:32 IST|Sakshi
ప్రజా దీవెన యాత్రలో గ్రామస్తులతో ఈటల రాజేందర్‌

ఇల్లందకుంట (హుజురాబాద్‌): అందరి కష్టం.. అమరవీరుల త్యాగఫలం వల్ల తెలంగాణ వచ్చిందని, కేసీఆర్‌ ఒక్కడితోనే రాలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తాను తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తా, లేదంటే నువ్వు రాస్తవా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి, ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, మల్లన్నపల్లి, టేకుర్తి, గడ్డివానిపల్లి, చిన్నకోమటిపల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రజా దీవెన యాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఈటల రాజేందర్‌ ఇలా మాట్లాడారు. ప్రపంచంలో మనిషికి వెలగట్టే రాష్ట్రం తెలంగాణ, నాయకుడు కేసీఆరేనని అన్నారు. ‘బస్‌ ఎక్కించి సిద్దిపేట తీసుకుపోతున్నారు. వెల కట్టి పంపిస్తున్నారు. 19 ఏళ్లుగా నేను కాకుండా ఇంకా ఎవరన్నా వచ్చారా’ అని ప్రశ్నించారు. భయంతో  ముఖ్యమంత్రి ఫొటో గోడ మీద ఉంటే.. తన ఫొటో ప్రజల గుండెల్లో ఉందన్నారు. దాన్ని చెరపడం జేజమ్మ వల్ల కూడా కాదని స్పష్టం చేశారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ ఎన్నికల్లో కొట్లాడానని.. ఈ ఎన్నికకు కారణం కేసీఆరేనని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, నాయకులు సంపల్లి సంపత్‌రావు, పింగిళి రమేశ్‌ పాల్గొన్నారు.

మోత్కుపల్లిపై మండిపడ్డ ఈటల
బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు తనపై చేసిన విమర్శలపై ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. తాను వందల మందిపై కేసులు పెట్టించానని, వందల కోట్లు సంపాదించానని మోత్కుపల్లి చిల్లర ఆరోపణలు చేయడం సరైంది కాదని చెప్పారు. విమర్శలు చేసేటప్పుడు గత చరిత్రలు చూసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు