మోగిన ఎన్నికల నగారా.. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

14 Oct, 2022 16:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. వీటి ప్రకారం నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఒకే విడతలో జరుగుతాయి.

మొత్తం నియోజకవర్గాలు: 68
నోటిఫికేషన్‌ : అక్టోబర్‌ 17
నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్‌ 25
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్‌ 27
నామినేషన్ల ఉపసంహరణ : అక్టోబర్‌ 29
పోలింగ్‌ : నవంబర్‌ 12
ఫలితాలు : డిసెంబర్‌ 8

హిమాచల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య : 55,07,261
ఓటర్లు పురుషులు – 27,80,208
మహిళలు – 27,27,016
మొదటిసారి ఓటర్లు – 1,86,681
80+ వయస్సు ఉన్న ఓటర్లు – 1,22,087
వందేళ్లపై ఉన్న ఓటర్లు – 1,184

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు కరోనా గురించి ఆందోళన అవసరం లేదని, కానీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈమేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగియనుంది. గుజరాత్ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో ఇటీవలే పర్యటించారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత హిమాచల్‌ షెడ్యూల్ ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. 2017లో జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలుకు బీజేపీ 99 కైసవం చేసుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 77 స్థానాలకే పరిమితమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాలకు బీజేపీ 45 సీట్లు గెలవగా.. కాంగ్రెస్ 20 స్థానాల్లో గెలుపొందింది.

అయితే ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆప్‌, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయతిస్తున్నాయి. 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో ఏ పార్టీ వరుసగా రెండుసార్లు గెలువలేదు.
చదవండి: జ్ఞానవాపీ మసీదు కేసులో శివలింగంపై కోర్టు కీలక తీర్పు

మరిన్ని వార్తలు