‘కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందని భయపడుతున్నారు’

11 Aug, 2022 15:54 IST|Sakshi

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని టీఆర్‌ఎస్‌, బీజేపీలు భయపడుతున్నాయని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ పేర్కొన్నారు. వరంగల్‌లో రాహుల్‌గాంధీ సభ తర్వాత యువత కాంగ్రెస్‌ పార్టీ వైపు పెద్ద ఎత్తున ఆకర్షితమవుతోందన్నారు మధుయాష్కీ. 
గురువారం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన మధుయాష్కీ గౌడ్‌.. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ-టీఆర్‌ఎస్‌లు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.

‘మొన్నటి వరకు ముందస్తు ఎన్నికల హడావిడి మీరు చూశారు.. ఉన్నట్టుండి మునుగోడు ఉప ఎన్నికను తీసుకువచ్చారు. మునుగోడు ఎన్నికల మీద చర్చించాము. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని గమనించి బీజేపీ, టీఆర్‌ఎస్‌ అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ రాగానే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడం జరిగితే.. వెంటనే ఆమోదించడం జరిగింది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలో భాగంగానే ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ కుట్రలకు టీఆర్‌ఎస్‌ సహకరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తారు. అక్కడ ఎవరిని కలవరు. ఆయన హైదరాబాద్‌ వచ్చిన వెంటనే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తారు. ఉప ఎన్నికల తేదీ కూడా వాళ్లే ప్రకటిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉందా లేదా అన్నదే నా ప్రశ్న.

కేవలం ఐదు నిమిషాల్లోనే రాజీనామాను ఆమోదించడం జీవో విడుదల చేయడం జరిగింది.కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై కొట్లాడుతున్నట్టు నాటకాలాడారు.  పార్లమెంట్ లో విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల బిల్లు వ‌చ్చిప్పుడు స‌భోల ఒక్క టీఆర్ఎస్ ఎంపీ లేడు.. ఇదే చెబుతుంది.. ఇద్ద‌రూ ఒక్క‌టేన‌ని. కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం వల్లే విద్యుత్ సంస్కరణ బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు వెళ్ళింది. ఈ నెల 13న మునుగోడు లో పాద యాత్ర .. 16నుంచి మండలాల వారిగా సమావేశాలు ఉంటాయి. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి.. మునుగోడు లోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ నేతల పర్యటన ఉంటుంది. రాష్ట్ర నేతలంతా మునుగోడు లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటారు’ అని మధుయాష్కీ తెలిపారు.

మరిన్ని వార్తలు