రేవంత్‌రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్‌

27 Apr, 2021 15:27 IST|Sakshi

రేవంత్‌రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్‌

సాక్షి, వరంగల్: వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం 250 కోట్ల రూపాయల టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆరు నెలల్లో టెక్స్‌టైల్‌ పార్క్ ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. కాగా వరంగల్ నగర అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

ఆరు నెలల్లో పనులను ప్రారంభించకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. గిరిజన యూనివర్సిటీ కోసం భూమిని ఇప్పటికే కేటాయించామని కానీ కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయడం లేదని అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం నిరంతర పోరాటం చేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు