ఇల్లందకుంట (హుజూరాబాద్): పదవుల కోసం టీఆర్ఎస్ నాయకులు పెదవులు మూసుకుంటున్నారని, ఆత్మవంచన చేసుకుని బతకడం తనకు ఇష్టం లేకే పార్టీ నుంచి బయటకు వచ్చానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృష్ణకాలనీకి చెందిన పలువురు నాయకులు మంగళవారం ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. సీఎం కేసీఆర్తో అనేక అంశాలపై పెనుగులాడానని ఈటల పేర్కొన్నారు. తాను పేద ప్రజల కోసం కొట్లాడే బిడ్డనని, ఎవరికి ఆపద వచ్చినా తక్షణ సాయం అందిస్తానని చెప్పారు. పట్టణంలో ఇటీవల కాలంలో మరణించిన మృతుల కుటుంబాలను ఈటల పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కాగా, ఈటలకు బీసీ కులాల ఐక్య వేదిక మద్దతు తెలిపింది.