బీజేపీ నేత వాహనంలో ఈవీఎం.. ఈసీ సంచలన నిర్ణయం

2 Apr, 2021 15:07 IST|Sakshi

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘటన

ఈసీ సీరియస్‌.. నలుగురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రైవేట్‌ వాహనంలో ఈవీఎంను తరలించడం కలకలం సృష్టించింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించాల్సిన ఈవీఎంను ఓ బీజేపీ నాయకుడి వాహనంలో తీసుకు రావడం వివాదాస్పదంగా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసీ ఆ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ నాయకుడి వాహనంలో ఈవీఎం తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించని వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. కరీంగంజ్ జిల్లాలోని రాతాబరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

రతాబరి పరిధిలోని ఇందిరా ఎంవీ స్కూల్‌లో 149వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ పూర్తయిన తర్వాత సిబ్బంది బయలుదేరుతుండగా.. ఈసీ కేటాయించిన వాహనం చెడిపోయింది. అప్పటికే రాత్రి 9 గంటల కావడంతో సెక్టార్ ఆఫీసర్‌కు ప్రిసైడింగ్ అధికారి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఓ ప్రయివేట్ వాహనంలో ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్‌‌లకు తరలించారు. దాని యజమాని ఎవరు అనేది పరిశీలించకుండా వాహనంలో ఎక్కారు.

చివరకు ఆ వాహనాన్ని బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య మధుమితా పాల్ భార్యదిగా ధ్రువీకరించారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఈవీఎంను చేర్చిన వాహానాన్ని బీజేపీ నేత భార్యదిగా గుర్తించిన ప్రతిపక్ష కార్యకర్తలు వాహనంపై దాడిచేశారు. రాళ్లు విసరడంతో వారి నుంచి తప్పించుకోడానికి పోలీసులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి భారీగా బలగాలను రప్పించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వాహనంలోని సిబ్బందిని పోలీసులు సురక్షితంగా తరలించారు

ఈ విషయాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఆ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాక ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. బీజేపీ విజయం సాధించడం కోసం ఎంతకైనా దిగజారుతుంది అంటూ విమర్శిస్తున్నాయి. 

చదవండి: మట్టిలో పరుగులు తీసిన ప్రియాంక గాంధీ

మరిన్ని వార్తలు