ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి

12 Sep, 2022 01:44 IST|Sakshi
ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన కుమారస్వామి

కుమారస్వామితో భేటీలో సీఎం కేసీఆర్‌

బీజేపీకి కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కాదని తేలిపోయింది

బీజేపీ, మోదీ విధానాలపై పోరాడాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు

జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి పెరుగుతోంది

దేశవ్యాప్తంగా రైతు సంఘాల నేతలు నన్ను కలిశారు

త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు.. విధివిధానాల రూపకల్పన: సీఎం కేసీఆర్‌

దేశానికి కేసీఆర్‌ నాయకత్వం, తెలంగాణ మోడల్‌ అత్యవసరం: కుమారస్వామి

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రజాస్వామిక, సమాఖ్య స్ఫూ ర్తి పరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత ప్రస్తుత దేశ రాజకీయాల్లో తక్షణ అవసరం. కాంగ్రెస్‌ నాయ కత్వంపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితుల్లో బీజేపీకి ఆ పార్టీ ఎంతమాత్రం ప్రత్యా మ్నాయం కాదనే విషయం తేటతెల్లమైంది. జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ రోజురోజు కూ నాపై ఒత్తిడి పెరుగుతోంది.

బీజేపీ మతతత్వ విధా నాలు, మోదీ ప్రజా వ్యతిరేక.. నిరంకుశ వైఖరిపై పోరాడాల్సిందిగా వెళ్లిన ప్రతిచోటా ప్రజలు కోరు తున్నారు. జాతీయ పార్టీని స్థాపించి బీజేపీని ఇంటికి పంపాల్సిందిగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్‌ఎస్‌ కార్యవర్గాలు తీర్మానం చేస్తున్నాయి..’ అని సీఎం కేసీఆర్‌ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి వివరించారు.

ఆదివారం ప్రగతిభవన్‌లో వీరిద్దరూ భేటీ అ య్యారు. ఈ సందర్భంగా ఇటీవల రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను కూడా కేసీఆర్‌ తెలియజేశారు. మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించి, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించినట్లు తెలిపారు. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని  స్పష్టం చేశారు.

తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చు..
‘వ్యవసాయంతో పాటు ఆర్థిక, సామాజిక రంగాలను అధోగతి పాలు చేస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి పలువురు రైతు సంఘాల నేతలు ఇటీవల రాష్ట్రాన్ని సందర్శించారు. తెలంగాణలో అమలవుతున్న సాగు సంక్షేమ పథకాలను పరిశీలించారు. జాతీయ రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ తరహాలోనే రైతు రాజ్యం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. తెలంగాణలో రైతులకు ఇస్తున్న నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ తదితర పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయొచ్చు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.  

కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు
‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరం ఉంది. వర్తమాన రాజకీయాలు, పాలనలో ప్రత్యామ్నాయ శూన్యత నెలకొన్న నేప థ్యంలో కేసీఆర్‌ వంటి నాయకుడు అత్యవసరం. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషిస్తున్న కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.

ఆయన జాతీయ పార్టీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. గుణాత్మక మార్పు కోసం స్థాపించే ఆ పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తాం. తెలంగాణలో రైతుల శ్రేయస్సు లక్ష్యంగా అమలవుతున్న పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పాలన, పథకాలపై కర్ణాటక సహా అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపుతు న్నాయి. తెలంగాణ మోడల్‌ దేశానికి అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గుణాత్మక మార్పు కోసం కేసీఆర్‌ స్థాపించే రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తాం’ అని కుమారస్వామి ప్రకటించారు.

విభజన కుట్రలను సమష్టిగా తిప్పికొడతాం
దేశంలో విచ్ఛిన్నకర పాలనతో ప్రజల నడుమ విభ జన సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలు తిప్పి కొట్టడం సహా పలు అంశాలపై కేసీఆర్, కుమార స్వామి చర్చించారు. దేశం విచ్ఛిన్నం అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకోవాలని, ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఏకం కావాలని అభిప్రాయపడ్డారు. బీజేపీ ముక్త్‌ భారత్‌ కోసం సమష్టి కృషి చేయాలని నిర్ణయించారు.

భేటీలో ప్రస్తావనకు వచ్చిన మరికొన్ని ముఖ్యాంశాలు..
♦ దేశ చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ సాగిస్తున్న రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టకపోతే దేశంలో రాజకీయ, పాలన సంక్షోభం తప్పదు. అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలను వేదికగా మలుచుకోవాలి.
♦ దేశ రాజకీయాల్లో 75 ఏళ్లుగా సాగుతున్న మూస రాజకీయాల పట్ల దేశ ప్రజలు విసుగెత్తి పోయారు. వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉందనే సంకేతాలు అందుతున్నాయి.

ప్రత్యామ్నాయ రాజకీయ పంథాపై ఏకాభిప్రాయం
అంతర్జాతీయంగా పలు దేశాలలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను, అభివృద్ధి దిశగా ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను నేతలు పరిశీలించారు. ప్రత్యామ్నాయ రాజకీయ పంథానే నేడు దేశానికి అత్యవసరమనే అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.  

సాదర స్వాగతం, వీడ్కోలు
మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు చేరుకున్న కుమార స్వామికి సీఎం కేసీఆర్‌ సాదర స్వాగతం పలికారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూ దనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, బాల్క సుమన్, రాజేందర్‌రెడ్డిని కేసీఆర్‌ పరిచ యం చేశారు. ప్రగతిభవన్‌లో కుమార స్వామితో కలిసి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు భోజనం చేశారు.

సుమారు మూడు గంటల పాటు జరిగిన భేటీ అనంతరం బెంగళూరుకు బయలుదేరిన కుమారస్వామికి కేసీఆర్‌ మర్యాద పూర్వకంగా వీడ్కోలు పలికారు. కాగా ‘ప్రకాశవంతమైన దార్శనికత, వినూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వం, వ్యక్తిత్వం కలిగిన కేటీఆర్‌తో జరిగిన చర్చ అర్థవంతంగా సాగింది. కేటీఆర్‌ అభిమానం, గౌరవంతో నా హృదయం నిండిపోయింది’ అని కుమారస్వామి ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు