కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే 

4 Dec, 2022 02:04 IST|Sakshi

మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు తెలంగాణలోనూ కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి జోస్యం చెప్పారు. పార్టీ గెలవాలంటే, నాయకత్వంపై నమ్మకం ఉండాలని, ఆ విషయాన్ని బీజేపీ నిజం చేస్తోందని చెప్పారు. బీజేపీలో చేరాక తొలిసారిగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా శశిధర్‌రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎస్‌.కుమార్, డా.ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, మురళీగౌడ్‌ స్వాగతం పలికారు.

శశిధర్‌రెడ్డిని కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఇతరనేతలు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో అభినందించారు. శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై రాష్ట్ర ప్రజలు విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతున్నారని, అదే సమయంలో అభివృద్ధి, మార్పు అనేది బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నారని చెప్పారు. 1994, 1999 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాదని జాతీయపార్టీ నేతలకు ముందుగానే చెప్పగా అదే నిజమైందని గుర్తు చేశారు. 

శశిధర్‌ రెడ్డి చేరికతో నగరంలో పార్టీ మరింత బలోపేతం: కిషన్‌రెడ్డి 
శశిధర్‌రెడ్డి చేరికతో హైదరాబాద్‌ లో బీజేపీ మరింత బలపడుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. శశిధర్‌రెడ్డి్డ కుటుంబ నేపథ్యం గొప్పదని, ఎన్నో ఉద్యమాలకు ఆయన తండ్రి చెన్నారెడ్డి నేతృత్వం వహించారని గుర్తు చేశారు. శశిధర్‌రెడ్డి సౌమ్యుడిగా పేరుందని, మాజీమంత్రి పి.జనార్దన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌ ప్రజల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర వారిదన్నారు. 

మరిన్ని వార్తలు