హైదరాబాద్లో సెంటు భూమి కూడా లేదు: మాజీ మంత్రి రెడ్యా నాయక్
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్లో భూమి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను...లేకుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 10 చెప్పు దెబ్బ లు తింటాడా’’అని మాజీ మంత్రి రెడ్యా నాయక్ సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ...రేవంత్ రెడ్డి ఓ బ్లాక్మెయిలర్ అని టీపీసీసీ పదవిని డబ్బులతో కొనుగోలు చేశారని ఆరోపించారు.
హైదరాబాద్లో తమకు సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. తాను, తన కూతురు ఎటువంటి భూముల కోసం పార్టీ మారలేదని చెప్పారు. కాంగ్రెస్కు భవిష్యత్ లేదనే కారణంతోనే బీఆర్ఎస్లో చేరామన్నారు. గతంలో కొంత భూమికొని తర్వాత అమ్మేశామన్నారు. ఇదే భూమిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారని గుర్తు చేశారు.