కేటీఆర్‌ కంటే నేనే సీనియర్‌: తాటి

22 Jun, 2022 02:29 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న  మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు  

నన్ను పట్టించుకోకుంటే పార్టీ మారతా 

అశ్వారావుపేట: తాతల కాలం నుంచి సాగు చేస్తున్న పోడు భూములకు సంబంధించి అర్హులైన గిరిజన, నిరుపేద రైతులకు పట్టాలు ఇస్తామనే ఒప్పం దంతోనే నాడు వైఎస్సార్‌ సీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరానని, అయితే ప్రస్తుతం పోడుదారులకు సీఎం కేసీఆర్‌ హక్కు పత్రాలిస్తారనే నమ్మకం లేదని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. కేటీఆర్‌ కంటే ముందు నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని, ఆయన కంటే సీనియర్‌నని తెలిపారు.

నాడు పార్టీలోకి రావాలని ఆహ్వానించిన వారంతా.. నేడు అవమానాల పాల్జేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా పార్టీ అధిష్టానం తనను పట్టించుకుని గుర్తింపునివ్వాలని, లేదంటే పార్టీ మారేందుకూ వెనుకాడేది లేదన్నారు. మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో విలేకరులతో మాట్లాడుతూ, పూర్వ ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పరిస్థితి బాగాలేదని, అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి కేటీఆర్‌ తనని ప్రకటిస్తే రాజకీయంగా అణచివేసేందుకు పార్టీ నాయకులే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఒక్కరే ఎమ్మెల్యే గెలుపొందారని, వచ్చే ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉంటుం దని చెప్పారు. ఇటీవల తన కూతురు చనిపోతే రాష్ట్ర నాయకులెవరూ పరామర్శించేందుకు రాలేదని వాపోయారు.  

మరిన్ని వార్తలు